Chief Minister: ప్రభుత్వ శాఖల పనితీరుపై డ్యాష్బోర్డులో సీఎం సమీక్ష
ABN , First Publish Date - 2022-12-27T08:01:21+05:30 IST
సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) సోమవారం ఉదయం తన డ్యాష్
చెన్నై, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) సోమవారం ఉదయం తన డ్యాష్ బోర్డులో సేకరించిన వివరాలకనుగుణంగా సమీక్షించారు. నగరపాలక శాఖ, మంచినీటి సరఫరా శాఖ రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ, హోంశాఖ, రవాణా శాఖ తదితర కీలకమైన శాఖల పనితీరుపై కూడా సమీక్షించారు. రెవెన్యూ శాఖ పనితీరు పరిశీలించిన సీఎం కుల, నివాస, ఆదాయ ధ్రువ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి నెలలోగా ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. తంజావూరు, కోయంబత్తూరు, మదురై(Thanjavur, Coimbatore, Madurai) జిల్లాల్లో పట్టాల మార్పిడిలో జరుగుతున్న జాప్యంపై ఆయన మండిపడ్డారు. నగరపాలక శాఖ పనితీరుకు సంబంధించి వేలూరు, ధర్మపురి, మదురై జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ జలజీవన్ పథకం త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సక్రమంగా బస్సులు నడపాలని, ఏ ప్రాంతంలోనైనా నిర్ణీత సంఖ్యలో బస్సులు నడపకపోతే అందుకు గల కారణాలను తనకు తెలియజేయాలన్నారు. పోలీసు శాఖ పనితీరును సమీక్షించిన స్టాలిన్ ఆ శాఖలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం, రాష్ట్ర ఎలక్ర్టానిక్స్ విభాగం సలహాదారుల పీడబ్ల్యూసీ దేవిదార్ తదితరులు పాల్గొన్నారు.