Chidambaramలో తనిఖీలు
ABN , First Publish Date - 2022-06-08T14:10:36+05:30 IST
కడలూరు జిల్లా చిదంబరంలోని సుప్రసిద్ధ నటరాజస్వామివారి ఆలయంలో దీక్షితార్ల నిరసనల నడుమ హిందూ దేవాదాయ శాఖ ప్రత్యేక కమిటీ తనిఖీలు
- దీక్షితార్ల నిరసన
- ఆలయ లెక్కలు అప్పగించేందుకు నిరాకరణ
చెన్నై, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కడలూరు జిల్లా చిదంబరంలోని సుప్రసిద్ధ నటరాజస్వామివారి ఆలయంలో దీక్షితార్ల నిరసనల నడుమ హిందూ దేవాదాయ శాఖ ప్రత్యేక కమిటీ తనిఖీలు ప్రారంభించింది. కడలూరు ఎస్పీ శక్తిగణేశన్ నాయకత్వంలో సుమారు 50 మంది పోలీసుల బందోబస్తు మధ్య ఈ తనిఖీలు మంగళవారం ఉదయం మొదలయ్యాయి. ఆ ఆలయ నిర్వహణా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దీక్షితార్లు ఇటీవలి కాలంలో భక్తులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, కనకసభ వేదికపై నుంచి స్వామివారి దర్శనానికి నిరాకరిస్తున్నారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. అలాగే స్వామి దర్శనానికి ఇష్టానుసారంగా రుసుం వసూలు చేస్తున్నారని కూడా వందలాదిమంది భక్తులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆలయ జమాపద్దులను సక్రమంగా నిర్వర్తించడం లేదని కూడా ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో దీక్షితార్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం దేవాదాయ శాఖకు మద్దతిస్తుండగా, మరో వర్గానికి చెందిన దీక్షితార్లు తమ ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం దేవాదాయశాఖకు లేదంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ఆలయంలో అసలేం జరుగుతుందో పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కడలూరు జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ జ్యోతి నేతృత్వంలో ఏర్పాటైన ఆ కమిటీలో దేవాదాయశాఖ ఆలయ నిర్వహణాధికారి సుకుమార్, పెరంబలూరు జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అరవిందన్, వేలూరు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మణన్, పళని ఆలయ డిప్యూటీ కమిషనర్ నటరాజన్, తిరునల్వేలి జోనల్ ఆడిటింగ్ ఆఫీసర్ రాజేంద్రన్ సభ్యులుగా ఉన్నారు. మంగళవారం ఉదయం ఈ కమిటీ ఆ ఆలయంలో తనిఖీలు ప్రారంభించింది. ఆ సందర్భంగా ఆ ఆలయ లెక్కల వివరాలను అప్పగించేందుకు దీక్షితార్లు నిరాకరించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆలయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం సంప్రదించలేదని దీక్షితార్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారమే నటరాజస్వామివారి ఆలయ జమాపద్దులు నిర్వహిస్తున్నామని, అయితే భక్తులు ఎలాంటి ఫిర్యాదులు చేశారన్న వివరాలను దేవాదాయ శాఖ స్పష్టంగా వెల్లడించలేదని దీక్షితార్లు వాదనకు దిగారు. ఆలయ జమాపద్దులకు సంబంధించిన పత్రాలు మినహా మిగిలినవన్నీ పరిశీలించేందుకు కమిటీ సభ్యుల్ని అనుమతించారు. దీంతో ప్రత్యేక కమిటీ తమకిచ్చిన పత్రాలను క్షుణంగా పరిశీలించింది.. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులను, ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్న దీక్షితార్లను ఆలయ నిర్వహణ, సంరక్షణ, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా చెన్నైలో దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు మీడియాతో మాట్లాడుతూ... దీక్షితార్లు వ్యతిరేకించినా చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ముందుగా ప్రకటించినట్లు రెండు రోజులపాటు ప్రత్యేక కమిటీ పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.