Mango Ganja: మదరాసులో మామిడి గంజా!
ABN , First Publish Date - 2022-10-16T14:28:24+05:30 IST
రెండేళ్ల నుంచి రాష్ట్రంలో గంజాయి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఏపీ నుంచి రాష్ట్రానికి దిగుమతి అధికంగా ఉం
- కాలేజీ విద్యార్థులే టార్గెట్
- తల్లిదండ్రులూ.. పారాహుషార్!
- చెన్నైలో పెరిగిన గంజాయి విక్రయాలు
- పెరిగిన పోలీస్ నిఘా
‘కాలేజీకి వెళ్లొచ్చిన మీ అబ్బాయి వద్ద మామిడి వాసన వస్తోందా?.. అతను మత్తుగా కనిపిస్తున్నాడా?.. అయితే మీరు అప్రమత్తం కావాల్సిందే!.. సీజన్ కాని సమయంలో అతని వద్ద మామిడి వాసన వస్తోందంటే.. అతను ప్రత్యేకమైన ‘గంజాయి’ని వినియోగిస్తున్నాడని అనుమానించాల్సిందే! ఎందుకంటే నగరంలో స్మగ్లర్లు మామిడి వాసనతో కూడిన గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఉన్నత విద్యా కేంద్రాల వద్ద ఈ విక్రయాలు అధికంగా అమ్ముడవుతున్నట్లు అనుమానిస్తున్నాయి.
చెన్నై, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల నుంచి రాష్ట్రంలో గంజాయి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఏపీ నుంచి రాష్ట్రానికి దిగుమతి అధికంగా ఉండింది. దీనిని సీరియ్సగా పరిగణించిన రాష్ట్ర పోలీస్ శాఖ ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టడంతో ఇటీవలి కాలంలో గంజాయి విక్రయాలు తగ్గాయి. అయితే రాజస్థాన్(Rajasthan)లో విపరీతంగా ఉత్పత్తి అయ్యే మామిడి వాసనతో కూడిన గంజాయి దిగుమతి పెరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సాధారణ గంజాయితో పోలిస్తే మామిడి వాసనతో కూడిన గంజాయి ఖరీదు అత్యధికమని ఆ వర్గాలు వివరించాయి. ఈ గంజాయి తన సహజసిద్ధ వాసనకు విరుద్ధంగా మామిడి వాసన కలిగి వుంటుంది. దాంతో పోలీసులు దానిని గుర్తించడం కూడా కష్టం. అందుకే స్మగ్లర్లు ఈ రకమైన గంజాయిని దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కేంద్రాల వద్దనే ఈ గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని పోలీసులు
హెచ్చరిస్తున్నారు.
పెరిగిన మత్తుమాత్రల విక్రయాలు
ఇటీవలి కాలంలో నగర వ్యాప్తంగా మత్తుమాత్రల విక్రయాలు విపరీతంగా పెరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బయటకు కనిపించకుండా జేబుల్లో దాచుకునివెళ్లేందుకు అనువుగా వుండడం, తాము అనుకున్న విధంగా మత్తు ఇస్తుండడంతో యువకులు ఈ మాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్రమార్కులు తమకు తెలిసిన మందుల షాపుల వద్ద మత్తుమాత్రలను కొనుగోలు చేసి, దొంగచాటుగా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విద్యాలయాల సమీపంలో వుండే దుకాణాలు, ప్లాట్ఫారాలపై వుండే చిల్లరకొట్లలో ఈ మాత్రలు విక్రయిస్తుండడం పోలీసువర్గాలను సైతం దిగ్ర్భాంతి గొలుపుతోంది. పరిస్థితి చేయిదాటుతుండడంతో ఈ వ్యవహారంపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులుసిద్ధమవుతున్నారు.