చన్నీ, కేజ్రీవాల్పై అమిత్షా ఎదురుదాడి
ABN , First Publish Date - 2022-02-13T20:53:13+05:30 IST
దేశ ప్రధానికి రక్షణ ఇవ్వడంలో పంజాబ్లోని చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోం మంత్రి అమిత్షా..
లూథియానా: దేశ ప్రధానికి రక్షణ ఇవ్వడంలో పంజాబ్లోని చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. ప్రధానికే రక్షణ కల్పించలేకపోయిన వ్యక్తి మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడగలుగుతారని ప్రశ్నించారు. పంజాబ్లో లూథియానాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్షా ప్రసంగిస్తూ, చన్నీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఇటీవల పంజాబ్ పర్యటనలో ప్రధాని 20 నిమిషాల సేపు ఫ్లైఓవర్పైనే నిలిచిపోవడాన్ని ఆ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యూపీఏ తరహాలో కాకుండా దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేసే సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు.
బీజేపీని 'బిటిషర్ల'తో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం చన్నీ పోల్చడంపై అమిత్షా గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని లూటీ చేయాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారని అన్నారు. బ్రిటిషర్లు ఇండియాను లూటీ చేసినట్టే కేజ్రీవాల్, ఆయన ఢిల్లీ కుటుంబమైన రాఘవ్ చద్దా తదితరులు బయట నుంచి పంజాబ్ వచ్చి లూటీ చేయాలనుకుంటున్నారని ప్రత్యారోపణ చేశారు. వాళ్ల స్థానం ఏమిటో పంజాబ్ ప్రజలే చెబుతారని అన్నారు. కేజ్రీవాల్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను సైతం అమిత్షా తోసిపుచ్చారు.