ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోనే...

ABN , First Publish Date - 2022-01-08T21:33:06+05:30 IST

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం

ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోనే...

న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,  ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికలను కోవిడ్ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో కోవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులను సీ-విజల్ యాప్ ద్వారా పంపవచ్చునని, ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోపు ఎన్నికల అధికారి స్పందిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. 


గోవా, మణిపూర్‌ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.28 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.40 లక్షలు అని తెలిపారు. 


690 శాసన సభ నియోజకవర్గాల్లో 1,620 పోలింగ్ బూత్‌లను ప్రత్యేకంగా మహిళా సిబ్బందితో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక బూత్ ఈ విధంగా ఉంటుందన్నారు. 


పోలింగ్ సిబ్బందికి కోవిడ్-19 బూస్టర్ డోస్ వేయిస్తామన్నారు. పోలింగ్ సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా పరిగణిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-01-08T21:33:06+05:30 IST