నుపుర్ శర్మ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్లో వేలాదిమంది నిరసన.. ‘బాయ్కాట్ ఇండియా’ నినాదాల హోరు
ABN , First Publish Date - 2022-06-11T00:53:33+05:30 IST
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం వేలాదిమంది
ఢాకా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం వేలాదిమంది ర్యాలీ నిర్వహించారు. రాజధానిలోని బైతుల్ ముకర్రమ్ మసీదులో ప్రార్థనల అనంతరం వేలాదిమంది వీధుల్లోకి వచ్చి భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అలాగే, ఈ నెల 16 భారత రాయబార కార్యాలయ ముట్టడికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. భారత వస్తువులను బాయ్కాట్ చేయాలంటూ నినాదాలు చేశారు.
జామియత్ ఉలేమా బంగ్లాదేశ్, ఖెలాఫత్ మజ్లిస్, ఇస్లామ్ ఒయిక్యాజోత్తోపాటు ఇతర మత సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఆందోళనల నేపథ్యంలో బైతులు ముకర్రమ్, పల్టాన్ ప్రాంతాల్లో ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (DMP) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు.
మొతీజీల్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ అహద్ మాట్లాడుతూ.. నేటి కార్యక్రమానికి ఇస్లామిక్ మూమెంట్ బంగ్లాదేశ్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, బంగ్లాదేశ్లోని పలు జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత సవార్ బస్టాండ్ ప్రాంతంలో ఢాకా-అరిచా రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. నారాయణ్గంజ్లో ‘నారాయణ్గంజ్ ఉలేమా పరిషత్’ ఆధ్వరంలో ఆందోళన నిర్వహించారు.