Bombay High Court: నిందితులకు న్యాయ వ్యవస్థ జవాబుదారీ

ABN , First Publish Date - 2022-09-12T01:20:44+05:30 IST

జైలులో నిర్బంధంలో ఉన్న నిందితులకు న్యాయ వ్యవస్థ జవాబుదారీ అని బోంబే

Bombay High Court: నిందితులకు న్యాయ వ్యవస్థ జవాబుదారీ

ముంబై : జైలులో నిర్బంధంలో ఉన్న నిందితులకు న్యాయ వ్యవస్థ జవాబుదారీ అని బోంబే హైకోర్టు (Bombay High Court) చెప్పింది. ట్రయల్ కోర్టుల నుంచి ప్రాథమికంగా ఆశించే అంశం సత్వర, న్యాయ విచారణ అని పేర్కొంది. మాదక ద్రవ్యాలు, ఉన్మత్త పదార్థాల చట్టం (NDPS Act) ప్రకారం కేసుల విచారణలో తీవ్ర జాప్యం చేస్తున్న ఓ ప్రత్యేక కోర్టును మందలించింది. 


ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం 2018 ఫిబ్రవరి నాలుగున అరెస్టయిన వ్యక్తి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై బోంబే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఈ నెల 5న విచారణ జరిపింది. ఈ కేసులో విచారణను వేగంగా పూర్తి చేయాలని ప్రత్యేక కోర్టును ఆదేశించడంతో పిటిషనర్ అప్పట్లో తన బెయిలు దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ 7న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో, ట్రయల్ కోర్టు ఆరు నెలల్లోగా ఆరోపణలను ఖరారు చేసి, విచారణను ప్రారంభించకపోతే, బెయిలు కోసం మళ్లీ దరఖాస్తు చేయవచ్చునని నిందితునికి తెలిపింది. ఆరు నెలలు గడచిపోయినప్పటికీ ట్రయల్ కోర్టు విచారణను ప్రారంభించలేదు. దీంతో నిందితుడు రెండోసారి బెయిలు కోసం దరఖాస్తు చేశారు. 


2021 జూలై 15న ఆరోపణలను ఖరారు చేసినప్పటికీ, 2022 సెప్టెంబరు 3 వరకు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించలేదని హైకోర్టు గమనించింది. ఈ కేసులో 15 మంది సాక్షులు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదని పేర్కొంది. 2018 ఫిబ్రవరి 4 నుంచి నిందితుడు జైల్లో ఉన్నప్పటికీ, విచారణ నత్తనడకన సాగుతోందని వ్యాఖ్యానించింది. సత్వర న్యాయం అనేది భారత రాజ్యాంగంలోని అధికరణ 21లో అంతర్భాగమని తెలిపింది. నిర్బంధంలో ఉన్న నిందితునికి న్యాయ వ్యవస్థ కూడా జవాబుదారీ అని తెలిపింది. న్యాయమైన, వేగవంతమైన విచారణ జరగాలని ఆశిస్తారని, ఇదే ఈ వ్యవస్థ నుంచి అతి కనిష్ట స్థాయిలో ఆశించే అంశమని వివరించింది. ఈ కేసుతోపాటు పెండింగ్ కేసుల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. 


Updated Date - 2022-09-12T01:20:44+05:30 IST