Enforcement Directorate: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై బలవంతపు వసూళ్ళ కేసు నమోదు
ABN , First Publish Date - 2022-08-17T17:34:59+05:30 IST
బలవంతపు వసూళ్ళు (extortion) కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్

న్యూఢిల్లీ : బలవంతపు వసూళ్ళు (extortion) కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)ను నిందితురాలిగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన ఛార్జిషీటును బుధవారం దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాన్మన్ సుఖేశ్ చంద్రశేఖర్ (conman Sukesh Chandrashekhar) బలవంతపు వసూలుదారు అని ఆమెకు తెలుసునని ఈడీ ఆరోపించింది. ఆయన ఢిల్లీలోని ఓ ఫార్మాస్యూటికల్ వ్యాపారి భార్య నుంచి రూ.215 కోట్లు అక్రమంగా వసూలు చేశారని, దీనిలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాటా స్వీకరించారని ఆరోపించింది. ఆమెకు రూ.10 కోట్ల విలువైన బహుమతులను సుఖేశ్ పంపినట్లు అంతకుముందు ఈడీ గుర్తించింది.
ఇప్పటి వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు చెందిన సుమారు రూ.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య తీసుకుంది. సుఖేశ్తో ఆమెకుగల సంబంధాలపై అనేకసార్లు ఆమెను ఈడీ ప్రశ్నించింది.
సుఖేశ్ చంద్రశేఖర్పై వివిధ రాష్ట్రాల్లో దాదాపు 32 క్రిమినల్ కేసులు దర్యాప్తులో ఉన్నాయి. వీటిపై వివిధ రాష్ట్రాల పోలీసులు, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నాయి. సుఖేశ్ ఢిల్లీలోని ఓ ఫార్మాస్యూటికల్ వ్యాపారి భార్య నుంచి రూ.215 కోట్లు అక్రమంగా గుంజినట్లు కేసు నమోదైంది. ప్రధాన మంత్రి కార్యాలయ ఉద్యోగిని అని చెప్పుకుంటూ ఆమెను బెదిరించి ఈ సొమ్మును వసూలు చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఆ వ్యాపారికి బెయిలు ఇప్పిస్తానని నమ్మబలికి ఈ సొమ్మును వసూలు చేసినట్లు కేసు నమోదైంది.