Boat Safari: పూండి రిజర్వాయర్లో త్వరలో బోట్ సఫారీ
ABN , First Publish Date - 2022-07-23T17:16:34+05:30 IST
తిరువళ్లూరు జిల్లాలోని పూండి జలాశయంలో త్వరలో బోట్ సఫారీ(Boat Safari) నిర్వహించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని ప్రజాపనుల శాఖ
- పీడబ్ల్యూడీ సీఈ మురళీధరన్ ప్రకటన
చెన్నై, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తిరువళ్లూరు జిల్లాలోని పూండి జలాశయంలో త్వరలో బోట్ సఫారీ(Boat Safari) నిర్వహించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని ప్రజాపనుల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధరన్ ప్రకటించారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న పూండి రిజార్వాయర్లో ప్రస్తుతం 3.231 టీఎంసీలు నిల్వచేయడానికి వీలుంది. ఈ నేపథ్యంలో అదనంగా 1.5 టీఎంసీల వరకు నిల్వచేయడానికి పూండి రిజర్వాయర్ ఎత్తు మరో రెండడుగులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం(Tamilnadu State Governament) నిర్ణయించింది. ఆ మేరకు ఈ పథకం అమలుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శుక్రవారం ఉదయం ప్రపంచ బ్యాంక్ సలహాదారుడు సూబే నాయకత్వంలో ప్రజాపనుల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధరన్, ప్రణాళికా విభాగం చీఫ్ ఇంజనీర్ పొన్రాజ్, ఎస్ఈ ముత్తయ్య, ఈఈ పి. తిలగం, ఏఈలు సత్యనారాయణ, రమే్షతో ఏర్పాటైన కమిటీ ఆ రిజర్వాయర్ను పరిశీలించింది. రిజర్వాయర్ క్రష్గేట్ల వద్ద అధికారులు నవీన సాంకేతిక పరికరాలతో వాటి పటిష్టత పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాపనుల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ పర్యాటక ప్రాంత మైన పూండి రిజర్వాయర్లో త్వరలోనే బోట్ సఫారీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో పూండి రిజర్వాయర్ నీటితో నిండిపోతుందని, ఆ సమయాల్లో అదనపు జలాలను క్రష్గేట్ల ద్వారా వృథాగా విడుదల చేస్తుంటారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ ఎత్తును రెండడుగుల మేర పెంచి వృథా అవుతున్న నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు ప్రపంచ బ్యాంక్ నిధులతో కుశస్థలి, కూవమ్ కాల్వలలో చెక్డ్యామ్లు కూడా నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.