జనవరి 31న విరోధ్ దివస్ : బీకేయూ
ABN , First Publish Date - 2022-01-16T00:41:20+05:30 IST
తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 31న
న్యూఢిల్లీ : తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 31న విరోధ్ దివస్గా పాటిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) శనివారం ప్రకటించింది. బీకేయూ నేత యుధ్వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేయలేదని, దీనిపై తమను సంప్రదించలేదని చెప్పారు. ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండలో నిందితుని తండ్రి మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించలేదని చెప్పారు.
ఇదిలావుండగా తాము లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఈ నెల 21 నుంచి దాదాపు 4 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో బన్బిర్పూర్ వద్ద 2021 అక్టోబరు 3న ఓ కారు కొందరు రైతులపై నుంచి దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ కేసులో నిందితుల్లో ఒకరు. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.