Future course: బీజేపీ బీహార్ విభాగం కోర్ గ్రూప్ సమావేశం
ABN , First Publish Date - 2022-08-16T23:36:39+05:30 IST
భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర నాయకత్వం ఆ పార్టీ బీహార్ విభాగం (Bihar Unit) నేతలతో కీలక సమవేశం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర నాయకత్వం ఆ పార్టీ బీహార్ విభాగం (Bihar Unit) నేతలతో కీలక సమవేశం నిర్వహిస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం మొదలవుతుంది. బీహార్లో బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర నేతలతో కేంద్ర నాయకత్వం సమావేశమవుతుండటం ఇదే మొదటిసారి.
సమావేశంలో చర్చించే అంశాలు..
బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, 2024 లోక్సభ ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో కీలకంగా నేతలు చర్చించనున్నారు. బీహార్లో సంస్థాగత మార్పుల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేత అమిత్షా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాపరమైన) బీఎల్ సంతోష్ కూడా హాజరవుతారు. కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, పార్టీ సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, సుశీల్ మోదీ (వీరంతా బీహార్కు చెందిన వారే) ఈ సమావేశానికి హాజరుకానున్నారు. బీజేపీ బీహార్ విభాగం అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాకిషోర్ ప్రసాద్, రేణు దేవి, ఆ రాష్ట్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ హాజరయ్యే అవకాశం ఉంది.