BJP state president: 2024లో అసెంబ్లీకీ ఎన్నికలు !
ABN , First Publish Date - 2022-09-27T14:05:30+05:30 IST
పార్లమెంటు ఎన్నికలతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడం ఖాయమని, ఈసారైనా ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని బీజేపీ రాష్ట్ర
- ఈసారైనా ఆలోచించి ఓటెయ్యండి
- ప్రజలకు బీజేపీ అధ్యక్షుడి పిలుపు
- డీఎంకేవి దోపిడీ రాజకీయాలు: అన్నామలై
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 26: పార్లమెంటు ఎన్నికలతోపాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడం ఖాయమని, ఈసారైనా ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పిలుపునిచ్చారు. ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన డీఎంకే దోపిడీయే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన మండిపడ్డారు. కోయంబత్తూర్, మదురై, సేలం, కన్నియాకుమారి, తిరుప్పూర్ తదితర జిల్లాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇళ్లపై జరిగిన పెట్రోల్ బాంబు దాడులను ఖండిస్తూ, డీఎంకే ఎంపీ రాజా హిందువులను కించపరిచారని ఆరోపించిన బీజేపీ.. ఇందుకు నిరసనగా సోమవారం కోయంబత్తూరు శివానందకాలనీ జంక్షన్లో భారీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన కె. అన్నామలై మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు నిలయంగా పేరుగడించిన రాష్ట్రంలో 15 నెలల డీఎంకే పాలనలో అనేక మార్పులు జరిగాయని, ముఖ్యంగా పీఎఫ్ఐ కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల అనంతరం హింసాత్మక సంఘటనలు పెరిగాయన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేస్తామన్న డీజీపీ శైలేంద్రబాబు చేసిన ప్రకటనకు పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, కానిస్టేబుళ్లు కట్టుబడకుండా అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. పదేళ్ల అనంతరం అధికారంలో కూర్చున్న డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం పక్కనపెట్టి, ప్రాజెక్ట్ల అనుమతుల జారీకి కమిషన్లు దండుకోవడం, సోలార్ విద్యుత్, తోళ్ల పరిశ్రమ, విద్యుత్, తాగునీటి కనెక్షన్లకు లంచాలు డిమాండ్ చేయడంలో శ్రద్ధ చూపుతుందని విమర్శించారు. డీఎంకే(DMK) అరాచక పాలనకు సాగనంపేందుకు నడుం బిగించాలన్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, బీజేపీ నేతలు మురుగానందం, ఎస్ఆర్ శేఖర్, మోహన్రాజ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ.రాజా వ్యాఖ్యలకు నిరసనగా.. ఆయన విగ్రహానికి, ఫొటోలకు బీజేపీ కార్యకర్తలు చెప్పల దండలు వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.