హిట్లర్, స్టాలిన్, ముస్సోలినిల కంటే బీజీపీ పాలన అధ్వానం : Cm Mamata Banerjee
ABN , First Publish Date - 2022-05-24T03:21:30+05:30 IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సెంట్రల్ ఏజెన్సీలను వాడుకుని రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ఆమె మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య రక్షణార్థం సెంట్రల్ ఏజెన్సీలకు స్వయంప్రతిపత్తి అవశ్యమని ఆమె వ్యాఖ్యానించారు. అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్ లేదా బెనిటో ముస్సోలినిల కన్నా బీజేపీ పాలన అధ్వానంగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా కాన్ఫరెన్స్లో మమత బెనర్జీ మాట్లాడారు. సెంట్రల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చుతూ భారత సమాఖ్య రూపాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేస్తోందని మమత బెనర్జీ ఆగ్రహించారు. సెంట్రల్ ఏజెన్సీలకు స్వయంప్రతిపత్తి అవసరమని పునరుద్ఘాటించారు.
ఇటివల పెట్రోల్, డీజెల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడాన్ని ‘ఎలక్షన్ స్టంట్’గా ఆమె అభివర్ణించారు. గత శనివారం పెట్రోల్పై రూ.8, డీజీల్పై రూ.6 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. అయితే పేదరిక రేఖకు దిగువున ఉన్నవారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారని అన్నారు. దేశంలో అన్ని ఎన్నికలకు ముందు బీజేపీ చేసింది ఇదేనని విమర్శించారు. ఉజ్వల యోజనలో పేదరిక రేఖకు దిగువున ఉన్నవారు చాలా తక్కువమంది ఉన్నారని అన్నారు. పేద ప్రజలు రూ.800 సిలిండర్ ఎలా కొనసాగుతారని ఆమె ప్రశ్నించారు.