2000 Rupee Note: 2 వేల రూపాయల నోటుపై రాజ్యసభలో సంచలన ప్రతిపాదన

ABN , First Publish Date - 2022-12-12T16:40:50+05:30 IST

2 వేల రూపాయల నోటు రద్దయ్యే అవకాశాలున్నాయా? తాజా పరిస్థితులు చూస్తుంటే క్రమంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2000 Rupee Note: 2 వేల రూపాయల నోటుపై రాజ్యసభలో సంచలన ప్రతిపాదన
2000 Rupee Note

న్యూఢిల్లీ: 2 వేల రూపాయల నోటు రద్దయ్యే అవకాశాలున్నాయా? తాజా పరిస్థితులు చూస్తుంటే క్రమంగా కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016 నవంబర్ 8 వ తేదీన వెయ్యి రూపాయలు, ఐదొందల నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత కొత్తగా 2 వేల రూపాయల నోటు చెలామణిలోకి తీసుకొచ్చింది. అయితే నల్లధనాన్ని కట్టడి చేయాలంటూ వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్రం 2 వేల రూపాయల నోటును తేవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2 వేల రూపాయల నోటును మూడేళ్లుగా ప్రచురించడం ఆపేశారు. అయితే క్రమంగా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలే కోరుతున్నారు.

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ పార్లమెంట్‌లో ఈ డిమాండ్ లేవనెత్తారు. క్రమంగా 2 వేల రూపాయల నోటును రద్దు చేయాలని రాజ్యసభ జీరో అవర్‌లో డిమాండ్ చేశారు. చిన్న నోట్లు రద్దు చేసి పెద్ద నోట్లను చెలామణిలో ఉంచడం సరికాదన్నారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో కూడా పెద్ద నోట్లు చెలామణిలో లేవన్నారు. పెద్ద నోట్లు మనీ లాండరింగ్‌కు, డ్రగ్స్ ఖరీదు చేసేందుకు వాడుతున్నారని సుశీల్ మోదీ ఆరోపించారు. ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రెండేళ్ల వ్యవధి ఇచ్చి ఆ తర్వాత కేంద్రం రద్దు చేస్తే బాగుంటుందని సుశీల్ మోదీ సూచించారు. ఏటీఎంలలో కూడా 2 వేల నోట్ల రూపాయలు రావడం లేదని కూడా ఆయన కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. 2 వేల రూపాయల నోట్లపై అనేక అపోహలున్నాయని, వాటిపై కేంద్రం స్పష్టతనీయాలని సుశీల్ మోదీ కోరారు.

అధికార పార్టీ ఎంపీ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు కేంద్రంలోని మోదీ సర్కారు ఏ విధంగా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2022-12-12T16:55:09+05:30 IST