5 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల వ్యయం రూ.344 కోట్లు!
ABN , First Publish Date - 2022-09-23T07:49:38+05:30 IST
ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రె్సల ఎన్నికల వ్యయం భారీగానే ఉంటోంది. కాంగ్రె్సతో పోల్చితే బీజేపీనే ఎక్కువ మొత్తంలో వెచ్చించింది. ఈ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల ఎన్నికల వ్యయం భారీగానే ఉంటోంది. కాంగ్రెస్తో పోల్చితే బీజేపీనే ఎక్కువ మొత్తంలో వెచ్చించింది. ఈ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఖర్చులపై ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలను విశ్లేషించినప్పుడు ఈ విషయం వెల్లడయింది. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం రూ.344.27 కోట్లు ఖర్చు చేసింది. ఇదే రాష్ట్రాల్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 218.26 కోట్లు వెచ్చించింది. అప్పటితో పోల్చితే వ్యయం 58% అధికం. గరిష్ఠంగా యూపీలో రూ.221.32 కోట్లను వినియోగించింది. పంజాబ్లో వ్యయం రూ.7.43 కోట్ల నుంచి రూ.36.70 కోట్లకు పెరిగింది. గోవాలో ఎన్నికల్లో రూ.19.07 కోట్ల ఖర్చు అయింది. ఉత్తరాఖండ్లో వ్యయం రూ.7.86 కోట్ల నుంచి రూ.23.52 కోట్లకు, మణిపూర్లో 23.48 కోట్ల నుంచి రూ.43.67 కోట్లకు పెరిగింది. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడిన తేదీ నుంచి ఎన్నికలు ముగిసేవరకు 63 రోజుల్లో బీజేపీకి మొత్తం రూ.914 కోట్ల నిధులు సమకూరాయి. కేంద్ర కార్యాలయంతో పాటు ఆ అయిదు రాష్ట్రాల కార్యాలయాలు వీటిని సేకరించాయి.
80 శాతం పెరిగిన కాంగ్రెస్ వ్యయం
కాంగ్రెస్ విషయానికి వస్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో కన్నా 80% అధికంగా ఖర్చు చేసింది. 2017లో రూ.108.14 కోట్లు ఖర్చు చేయగా, 2022లో రూ.194.80 కోట్లు వ్యయం చేసింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇవ్వన్నప్పటికీ సామాజిక మాధ్యమాలు, వర్చువల్ ప్రచారం కోసం రూ.15.67 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. రూ.240.10 కోట్ల నిధులు సేకరించింది.