ఝార్ఖండ్ సీఎంకు భారీ ఊరట
ABN , First Publish Date - 2022-11-08T03:16:14+05:30 IST
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు సోమవారం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
ఆయనపై దాఖలైన వ్యాజ్యాలకు విచారణార్హత లేదు : సుప్రీం
న్యూఢిల్లీ, నవంబరు 7: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు సోమవారం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. గనుల శాఖ మంత్రిగా ఉండగా తనకు తాను మైనింగ్ లీజును ఇప్పించుకున్నారని ఆరోపిస్తూ తొలుత ఝార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరపవచ్చని హైకోర్టు ఈ ఏడాది జూన్ 3న తీర్పు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ హేమంత్ సొరేన్తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. వాటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధులియా ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది. నిర్దిష్టంగా కేసులు నమోదు కానప్పటికీ, ఈడీ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది.