Bharat Jodo Yatra: సరి కొత్త వివాదం
ABN , First Publish Date - 2022-09-12T19:55:28+05:30 IST
కన్యాకుమారి: భారత్ జోడో యాత్రలో సరికొత్త వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్పై తాజాగా రగడ మొదలైంది.
కన్యాకుమారి: భారత్ జోడో యాత్రలో సరికొత్త వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్పై తాజాగా రగడ మొదలైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిక్కరును తగులబెడుతున్న ఫొటోపై మరో 145 రోజులు మాత్రమే భారత్ జోడో యాత్ర ఉందనే క్యాప్షన్ రాసి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విద్వేషం నుంచి దేశాన్ని కాపాడతామని, ఒక్కొక్క అడుగు వేస్తూ లక్ష్యాన్ని చేరుకుంటామని ట్విట్కు మ్యాటర్ యాడ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ట్వీట్పై బీజేపీ మండిపడింది. హింసను ప్రేరేపించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసిందని, ఇది తగదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3500 కిలోమీటర్లు కాలినడకన పర్యటించే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజులు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగనుంది.
రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటినుంచీ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
భారత్ జోడో యాత్రలో పాల్గొనే కాంగ్రెస్ పార్టీ నేతలు లగ్జరీ కంటైనర్లు వాడుతున్నారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ బర్బెరీ బ్రాండ్కు చెందిన టీ-షర్టు ధరించారని, దీని ధర రూ.41వేలు అని బీజేపీ చెబుతోంది. ఖరీదైన, బ్రాండెడ్ దుస్తులు ధరించి నిరుపేదల సమస్యలు తెలుసుకుంటారా అని బీజేపీ ఎద్దేవా చేసింది. పాస్టర్ జార్జి పొన్నయ్యతో రాహుల్ సమావేశంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో భాగంగా రాహుల్ గాంధీ ఆయనను ''ఏసుక్రీస్తు భగవంతుని రూపమా? అది నిజమేనా?'' అని ప్రశ్నించారు. వెంటనే జార్జి పొన్నయ్య తడుముకోకుండా ''ఆయన ఒక్కడే నిజమైన దేవుడు'' అని సమాధానమిచ్చారు. తన వాదన కొనసాగుస్తూ, భగవంతుడు మనిషి రూపంలోనే వెల్లడవుతాడు, మీ శక్తి లాంటి వాడు కాదంటూ పోలిక తెచ్చారు. దీంతో వివాదాస్పద పాస్టర్ను రాహుల్ కలుసుకోవడం, ఫాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. వివాదాస్పద పాస్టర్ను రాహుల్ కలుసుకోవడం, పాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ విమర్శలు గుప్పించారు. శక్తి (హిందూ దేవతలు) తరహాలో కాకుండా జీసస్ మాత్రమే భగవంతుడు అని పాస్టర్ చెప్పడాన్ని నిలదీశారు. గతంలో ఇదే పాస్టర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యారని గుర్తుచేశారు. హిందువులను సవాలు చేసి, బెదరించిన జార్జి పొన్నయ్య భారత్ జోడో యాత్ర పోస్టర్ బాయ్ను కలిశారని, భారత్మాత గురించి ఆయన గతంలో అనుచితమైన వ్యాఖ్యలు చేశారని షెహజాద్ అన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రాం రమేశ్ స్పందించారు. తాను నిక్కర్లు, టీ షర్టులపై వ్యాఖ్యానించబోనన్నారు. భారత్ జోడో ద్వారా దేశాన్ని ఐక్యం చేస్తామని పునరుద్ఘాటించారు. అదే సమయంలో బీజేపీ మాట్లాడే భాషలోనే తాము జవాబు చెప్తామన్నారు.
సంఘ్ నిక్కర్ తగలబెడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్విట్పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. సంఘ్పై గతంలో రెండుసార్లు అకారణంగా నిషేధం విధించారని, కానీ ఆర్ఎస్ఎస్ దేశ ప్రజల మనసు గెలుచుకుంటూ మరింత విస్తరిస్తూ పోతోందని సంఘ్ అధికార ప్రతినిధి డాక్టర్ ఎం వైద్య తెలిపారు. సత్యం, సిద్ధాంతం, త్యాగం, పరిశ్రమ, బలిదానం ద్వారా సంఘ్ సమాజం మద్దతు పొందుతోందన్నారు.