Heavy rains: నగరాన్ని ముంచెత్తిన వాన
ABN , First Publish Date - 2022-09-06T16:36:40+05:30 IST
భారీ వర్షానికి సిలికాన్ సిటీ(Silicon City) విలవిలలాడింది. ఒక్కరాత్రిలో 148 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో రోడ్లు చెరువు
- జలప్రళయాని సిలికాన్ సిటీ విలవిల
- విధానసౌదలోకి చేరిన వర్షపు నీరు
- ఎయిర్ పోర్టు ప్రయాణికులకు తిప్పలు
- ఒక్కరోజులో రూ. 200 కోట్లకుపైగా నష్టం
- 148 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదు
బెంగళూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షానికి సిలికాన్ సిటీ(Silicon City) విలవిలలాడింది. ఒక్కరాత్రిలో 148 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో రోడ్లు చెరువులుగా మారాయి. ప్రధానంగా మారతహళ్లి, సంపంగి రామనగర్, సర్జాపుర రింగ్రోడ్డు ప్రాంతాల్లో సంచారానికి పెను సమస్య ఏర్పడింది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం తెల్లవారుదాకా నగరమంతటా వరుణుడు హోరెత్తాడు. వందలాది ఐటీ కంపెనీలు కలిగిన సర్జాపుర, వైట్ఫీల్డ్, మారతహళ్లి ప్రాంతాలు నదులను తలపించా యి. బెళ్లందూరుతోపాటు సమీప ప్రాంతాల్లో పదులసంఖ్యలో అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. మారతహళ్లి - సిల్క్బోర్డు జంక్షన్ రోడ్డు, హోసూరు రోడ్డు, కోరమంగల, సర్జాపుర ప్రాంతాల్లో వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అపార్ట్మెంట్ సెల్లార్లలో నిలిపిన కార్లు, ద్విచక్రవాహనాలు నీట మునిగాయి. టెక్పార్క్లకు వెళ్లే రింగ్రోడ్డుపై అడుగుల కొద్దీ నీరు ప్రవహిస్తుండడంతో వా రంలో తొలిరోజునే వర్క్ ఫ్రం హోమ్ను పలు ఐటీ కంపెనీలు ప్రకటించాయి. ఒకరోజు వర్షానికే రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. మారతహళ్లి ప్రాం తంలో రబ్బర్బోట్లు, ట్రాక్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎ్ఫ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. శక్తికేంద్రమైన విధానసౌధకు వరుణుడి బెడద తప్పలేదు. రాత్రి కురిసిన వర్షానికి విధానసౌధ లోపలికి వర్షపునీరు చేరింది. బాంక్వెట్హాల్ సమీపంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే క్యాం టీన్లోకి నీరు చేరింది. సోమవారం ఉదయం క్యాంటీన్ సిబ్బంది తెరిచేందుకు ప్రయత్నించగా నీరు నిల్వ ఉండడాన్ని గమనించారు. విధానసౌధ ప్రాంగణంలో ఉండే పోలీస్ స్టేషన్లోకి కూడా నీరు చేరింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం(Airport) విమానాల రాకపోకలతోపాటు ప్రయాణికులకు తీవ్రసమస్య ఏర్పడింది. రాత్రంతా భారీ వర్షం కురుస్తుండడంతో గంటల తరబడి ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే గడిపారు. అంతర్జాతీయ విమానాలకు వెళ్లేవారు రాత్రి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో నానా తంటాలు పడ్డారు. ఎయిర్పోర్ట్ రోడ్డు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుదాకా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఎయిర్పోర్ట్ టోల్వద్ద సమస్యగా మారింది. భారత్ ఇన్ఫ్రా పరిస్థితి చూస్తే ఏడుపు వస్తోందంటూ ఓ వ్యక్తి వీడియో షేర్ చేయడం సర్వత్రా వైరల్ అయింది.
మరో ఐదు రోజులు వర్షం
ఒక్కరోజు వర్షానికే బెంగళూరు నగరమంతా జలమయం కాగా మరో ఐదు రోజులు నిరంతరంగా వర్షం కురవనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. బెంగళూరులో ఉరుములు, మెరుపులతో ఈ నెల 9వరకు వర్షాలు కురవవచ్చునని తెలిపింది. బీదర్, కలబురగి, విజయపుర, గదగ్, ధారవాడ, హావేరి, దావణగెరె, హాసన్, మైసూరు, మండ్య, చామరాజనగర, కోలారు జిల్లాల్లో నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. శివమొగ్గ, ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, కొడగు, చిక్కమగళూరు, ఉడుపి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరించారు.
నగరమంతా భారీ వర్షం
జూలై ప్రారంభం నుంచి సాధారణ కంటే ఎక్కువ వర్షం కురిసింది. జూలై నుంచి సెప్టెంబరు 3దాకా సాధారణంగా 300 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండేది. కానీ ఇప్పటి వరకు 643 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సంపంగిరామనగరలో 148 మిల్లీ మీటర్ల వర్షం కురవగా వైట్ఫీల్డ్, సర్జాపుర, వర్తూరు ప్రాంతాలలో 100 మిల్లీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. బెంగళూరు డీసీపీ కారుపై చెట్టుకూలింది. దక్షిణ విభాగం డీసీపీ కృష్ణకాంత్ కార్యాలయంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే చెట్టుకొమ్మ ఇన్నోవా కారుపై పడింది. కారులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా వందలాది ద్విచక్రవాహనాలు, కార్లు వర్షపునీటిలో మునిగాయి. బెంగళూరుతోపాటు మైసూరులో భారీ వర్షాల కారణంగా నంజనగూడు తాలూకా పరిధిలో పలు గ్రామాలకు వర్షపునీరు చేరింది. సముద్రతీర జిల్లాల్లో వరుణుడి ప్రభావం మరింత తీవ్రంగా కనిపించింది.