స్వాతంత్య్ర వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు బంద్
ABN , First Publish Date - 2022-08-15T10:01:01+05:30 IST
బిహార్లో ఇటీవల అధికారం చేపట్టిన మహాగఠ్బంధన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో సోమవారం నిర్వహించ తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బిహార్ ప్రభుత్వ నిర్ణయం
పాట్నా, ఆగస్టు 14 : బిహార్లో ఇటీవల అధికారం చేపట్టిన మహాగఠ్బంధన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో సోమవారం నిర్వహించ తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. అయితే, ఆర్జేడీతో కలిసి ఇటీవల అధికారం చేపట్టిన నితీశ్ కుమార్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం వరకు అధికారంలో ఉన్న జేడీయూ-బీజేపీ కూటమి హర్ ఘర్ తిరంగాలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు చేసింది. కానీ, తమతో బంధాన్ని తెంచుకున్న నితీశ్ ఇప్పుడు వాటిని రద్దు చేయడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ జెండాను అవమానించడమేనని ఆ పార్టీ నేత అమిత్ మాల్వియ ట్వీట్ చేశారు.