Breaking News: రిలీజ్‌కు ఒక రోజు ముందే ‘టెలిగ్రామ్’లో ‘అవతార్-2’.. కలకలం

ABN , First Publish Date - 2022-12-15T21:21:20+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హాలీవుడ్

Breaking News: రిలీజ్‌కు ఒక రోజు ముందే ‘టెలిగ్రామ్’లో ‘అవతార్-2’.. కలకలం

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హాలీవుడ్ మూవీ ‘అవతార్-2’ (Avatar: The Way of Water) శుక్రవారం (16న) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే, అభిమానులను షాక్‌కు గురిచేస్తూ రిలీజ్‌‌కు ఒక రోజు ముందే ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైపోయింది. ‘టెలిగ్రామ్’ (Telegram) యాప్‌లో ఈ సినిమా కనిపించడంతో అందరూ షాకయ్యారు.

భారతీయ సినిమాలు కొన్ని రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం గతంలో చాలాసార్లు జరిగాయి. ‘వుడ్’లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పైరసీ గొడవ ఉంది. దీనిపై సినీ పరిశ్రమ ఒక్కటై పోరాటం కూడా చేసింది. అయినప్పటికీ అడపా దడపా పెద్ద సినిమాలు పైరసీ బారినపడుతున్నాయి. అయితే, కొన్ని వందల కోట్ల రూపాయలతో అత్యంత పకడ్బందీగా తెరకెక్కిన అవతార్-2 సినిమా పైరసీ బారినపడడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ‘టెలిగ్రామ్’ యాప్‌లో కనిపించిన ఈ సినిమా ఏ భాషకు సంబంధించినదన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

2009లో వచ్చిన ‘అవతార్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) ప్రపంచవ్యాప్తంగా 16న విడుదల అవుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే అత్యధికంగా 5 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. అందులోనూ దక్షిణాదిలో బుక్ అయినవే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో గతంలో ఈ రికార్డును ‘కేజీఎఫ్2’ పేరుపై ఉండగా ఇప్పుడా రికార్డును ‘అవతార్ 2’ తుడిచిపెట్టేసింది.

Updated Date - 2022-12-15T21:47:03+05:30 IST