Assamలో వెల్లువెత్తిన వరదలు...222గ్రామాలు ముంపు
ABN , First Publish Date - 2022-05-16T12:33:58+05:30 IST
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి...
గువహటి: అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 15 రెవెన్యూ సర్కిళ్లలోని 222గ్రామాల్లో 57 వేల మంది ప్రజలు వరదల బారినపడి అల్లాడుతున్నారు. 10321 హెక్టార్ల వ్యవసాయ భూములు వరదనీటిలో మునిగాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో శనివారం కొండచరియలు విరిగిపడ్డాయి.అసోం వరదల్లో ఇప్పటి వరకు ఓ చిన్నారి సహా ముగ్గురు మరణించారు. 1,434 పశువులు వరద బారిన పడ్డాయి. ఇప్పటివరకు వరదల వల్ల 202 ఇళ్లు దెబ్బతిన్నాయి.వరదల వల్ల డిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.
ఆర్మీ, పారా మిలటరీ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యకలాపాలు చేపట్టాయి. హోజాయ్, లఖింపూర్, నాగావ్ జిల్లాల్లో అనేక రోడ్లు, వంతెనలు, నీటిపారుదల కాలువలు దెబ్బతిన్నాయి.భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ కొండ భూభాగంలో రైల్వే ట్రాక్, వంతెనలు,రహదారి కమ్యూనికేషన్లకు భారీ నష్టం వాటిల్లింది.