టైలర్ హత్య ఉదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ suspended
ABN , First Publish Date - 2022-06-29T14:16:30+05:30 IST
ఉదయ్పూర్ నగరంలో టైలర్ హత్య తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎస్ఐను సస్పెండ్ చేశారు...
ఉదయ్పూర్(రాజస్థాన్):ఉదయ్పూర్ నగరంలో టైలర్ హత్య తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎస్ఐను సస్పెండ్ చేశారు.మంగళవారం నగరంలో హిందూ టైలర్ హత్య తర్వాత ఉదయ్పూర్లోని ధన్మండి పోలీస్స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్ని సస్పెండ్ చేశామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) హవాసింగ్ ఘుమారియా తెలిపారు.సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ను షేర్ చేసినందుకు టైలర్ కన్హయ్య లాల్పై జూన్ 11వతేదీన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. జూన్ 15వతేదీన బెయిల్పై ఉన్న సమయంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కన్హయ్యలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనకు వస్తున్న బెదిరింపు కాల్స్పై బాధితుడు కన్హయ్య లాల్ ఆందోళన వ్యక్తం చేసినా ఏఎస్ఐ పట్టించుకోలేదని ఆరోపించారు.
ఉదయపూర్ హత్య కేసు విచారణకు సిట్
ఉదయపూర్ హత్య కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.కన్హయ్య లాల్ హత్య తర్వాత ఉదయ్పూర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.సిట్లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అశోక్ కుమార్ రాథోడ్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, యాంటీ టెర్రర్ స్క్వాడ్ ప్రఫుల్ల కుమార్, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి, ఒక అదనపు అధికారి ఉన్నారు. ఉదయపూర్ డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్ శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.