Appreciation: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పాలన
ABN , First Publish Date - 2022-11-04T08:20:52+05:30 IST
డీఎంకే ప్రభుత్వంపై ధర్మపురం(Dharmapuram) ఆధీనం గురుమహా సన్నిధానం మాసిలామణి దేశిక పరమాచార్య స్వామి ప్రశంసల వర్షం కురిపించారు.
- ధర్మపురం ఆధీనం ప్రశంస
చెన్నై, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వంపై ధర్మపురం(Dharmapuram) ఆధీనం గురుమహా సన్నిధానం మాసిలామణి దేశిక పరమాచార్య స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజలకు డీఎంకే ఆధ్మాత్మిక పాలన అందిస్తోందని అభినందించారు. రాజరాజచోళుడి జయంతి వేడుకల సందర్భంగా తంజావూరు బృహదీశ్వరాలయ సిబ్బందికి ఆయన కొత్త దుస్తులు పంపిణీ చేశారు. ఆధీనం రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పరమాచార్య విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజరాజచోళ చక్రవర్తి సదయ (జయంతి నక్షత్రం) వేడుకలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. రాజరాజచోళుడి వల్లే పన్నెండు తిరుమురైకి సంబంధించిన 18వేల కీర్తనలు లభించాయని, తాళపత్రాల్లో, రాగిరేకుల్లో నిక్షిప్తమై ఉన్న ఆ కీర్తనలకు గ్రంథరూపం కల్పించేందుకు తమ ఆధీనం చర్యలు చేపడుతోందని వివరించారు. తాను గతంలో చెప్పినట్లు డీఎంకే(DMK) పాలనలో ఆలయాలన్నీ కొత్త మెరుగులు సంతరించుకున్నాయని, కుంభాభిషేకాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని, కనుక రాష్ట్రంలో ఆధ్యాత్మిక పరిపాలనే సాగుతోందని తెలిపారు.