Anbumani Ramdas: గవర్నర్‌గారూ.. ఇంకెంతమంది బలి కావాలి?

ABN , First Publish Date - 2022-12-10T09:24:33+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీకి ఇంకెంతమంది బలైతే గవర్నర్‌ స్పందిస్తారో అర్థం కావడం లేదని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అనుమ్బణి రాందాస్‌(A

Anbumani Ramdas: గవర్నర్‌గారూ.. ఇంకెంతమంది బలి కావాలి?

- అన్బుమణి ఆగ్రహం

చెన్నై, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ రమ్మీకి ఇంకెంతమంది బలైతే గవర్నర్‌ స్పందిస్తారో అర్థం కావడం లేదని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అనుమ్బణి రాందాస్‌(Anbumani Ramdas) ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్లాచ్చి సమీపంలోని కినత్తుకడవు మేట్టుపాళయానికి చెందిన సల్మాన్‌ అనే యువకుడు ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా లక్షలాది రూపాయలు పోగొట్టుకుని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడంపై అన్బుమణి శుక్రవారం స్పందించారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గతంలో కంటే ఇప్పుడు ఎంతోమందిని బలిగొంటోందన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని గవర్నర్‌ ఆమోదించకపోవడం నిరాశపరిచిందన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా ఇప్పటి వరకూ 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమేనని, కానీ కనీసం వందమంది చనిపోయివుండచ్చన్నారు. అందువల్ల తక్షణం గవర్నర్‌ ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టాన్ని ఆమోదించాలని అన్బుమణి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-10T09:24:39+05:30 IST