రెండేళ్ల తర్వాత సెక్రటేరియట్‌కు వచ్చిన ఉద్ధవ్

ABN , First Publish Date - 2022-04-14T01:20:14+05:30 IST

దాదాపు రెండేళ్ల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బుధవారంనాడు రాష్ట్ర సెక్రటేరియట్ ..

రెండేళ్ల తర్వాత సెక్రటేరియట్‌కు వచ్చిన ఉద్ధవ్

ముంబై: దాదాపు రెండేళ్ల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బుధవారంనాడు రాష్ట్ర సెక్రటేరియట్ మంత్రాలయకు వచ్చారు. గత 28 నెలల్లో ఆయన ఎక్కువ సమయం ఇంటి నుంచే తన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. నీలం-వైట్ కుర్తా ఫైజమా ధరించి, ఫేస్ మాస్క్‌తో సెక్రటేరియట్‌లోకి అడుగుపెట్టిన ఆయనకు ప్రభుత్వ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. సచివాలయంలోకి అడుగుపెట్టగానే ఆయన తొలుత ఛత్రపతి శివాజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాలు సమర్పించారు.


అనంతరం సెక్రటేరియట్ మెయిన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన 'లైఫ్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్' ఎగ్జిబిషన్‌ను సీఎం సందర్శించారు. సచివాలయంలోని వివిధ శాఖల ఉద్యోగులను ఆత్మీయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహారాష్ట్ర సీఎం కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మంత్రాలయను ముఖ్యమంత్రి సందర్శించడంపై మహారాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్ ఫెడరేషన్ చీఫ్ అడ్వయిజర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా విధి నిర్వహణలు సాగించేందుకు సీఎం రాక ఎంతో ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రికి తామంతా సాదర స్వాగతం పలికినట్టు చెప్పారు. రెండేళ్లుగా మంత్రాలయను సీఎం సందర్శించనప్పటికీ ఆయన అధికార నివాసమైన 'వర్ష' నుంచి ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఉద్యోగులు నేరుగా ఆయనను కలవనప్పటికీ ప్రతిరోజూ ఆయా శాఖల అధిపతులతో సీఎం మాట్లాడుతూనే ఉన్నారని చెప్పారు. ఆసక్తికరంగా, మంత్రాలయకు రెండేళ్లుగా ముఖ్యమంత్రి రాకపోయినా పాలనా పరమైన వ్యవహారాలలకు ఎలాంటి విఘాతం కలగలేదని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ ప్రశంసించారు. ఫైళ్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉద్ధవ్ ముందుకు వెళ్తున్నారని, ఎలాంటి ఇబ్బందీ తనకు కనిపించలేదని చెప్పారు.

Updated Date - 2022-04-14T01:20:14+05:30 IST