హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్న టెలిగ్రామ్ చానల్
ABN , First Publish Date - 2022-01-05T21:55:18+05:30 IST
మహిళా జర్నలిస్టును వేధించిన బుల్లీ బాయ్ యాప్ గురించి వివాదం
న్యూఢిల్లీ : ఓ మహిళా జర్నలిస్టును వేధించిన బుల్లీ బాయ్ యాప్ గురించి వివాదం సద్దుమణగక ముందే హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్న చానళ్ల గురించి కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి వచ్చింది. ఫేస్బుక్, టెలిగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని చానళ్ళు హిందూ మహిళలను వేధిస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశ్విని వైష్ణవ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, టెలిగ్రామ్లోని ఓ చానల్పై వెరిఫైడ్ యూజర్ ఫిర్యాదు చేయడంతో ఆ చానల్ను నిలిపేసినట్లు తెలిపారు. ఈ చానల్ను 2021 జూన్ నెలలో క్రియేట్ చేశారన్నారు. ఈ చానల్లో హిందూ మహిళల ఫొటోలను షేర్ చేయడంతోపాటు వారిని దుర్భాషలాడుతున్నారని చెప్పారు.
బుల్లీబాయ్ యాప్ కేసులో ఇప్పటి వరకు ముగ్గుర్ని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఉత్తరాఖండ్కు, ఒకరు బెంగళూరుకు చెందినవారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉండి ఉండవచ్చునని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రలే చెప్పారు.