private rocket : ప్రైవేటు రాకెట్ రెడీ
ABN , First Publish Date - 2022-11-17T04:01:01+05:30 IST
భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. భారత్లో ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్ ‘విక్రమ్-ఎస్’ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
రేపే ‘విక్రమ్-ఎస్’ ప్రయోగం
ఇస్రో చరిత్రలో సరికొత్త అధ్యాయం
చెన్నై, సూళ్లూరుపేట, నవంబరు 16: భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. భారత్లో ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్ ‘విక్రమ్-ఎస్’ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తయారు చేసిన ఈ రాకెట్ను ఇస్రో శుక్రవారం అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికకానుంది. వాస్తవానికి ఈ నెల 12నే ఈ ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఇది తొలుత ఈ నెల 15కి, ఆ తర్వాత 18కి వాయిదా పడింది. భారత అంతరిక్ష పితామహుడు, దివంగత శాస్త్రవేత్త విక్రమ్ సారాబాయికి నివాళిగా ఈ రాకెట్కు ‘విక్రమ్-ఎస్’ అని పేరుపెట్టారు. ప్రైవేటులో ఇదే తొలి మిషన్ కాబట్టి ప్రారంభ్ మిషన్గా దీన్ని పిలుస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12గంటల మధ్యలో ఈ రాకెట్ను అంతరిక్షంలోకి పంపనున్నారు.