9 thousand policemen: కొత్త ఏడాది వేడుకలకు భారీ భద్రత
ABN , First Publish Date - 2022-12-31T11:56:26+05:30 IST
కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతుండగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టేందుకు
- నగరంలో 9వేల మందితో బందోబస్తు
బెంగళూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతుండగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టేందుకు తీవ్ర కసరత్తు సాగిస్తోంది. రాజధాని బెంగళూరు(Bengaluru)లో భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎంజీ రోడ్, బ్రిగేడ్, చర్చి రోడ్ల వ్యాప్తంగా జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు కనీసం లక్ష మందికి పైగానే చేరతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే హోటళ్లు, బార్లు, పబ్లు సిద్ధమవుతున్నాయి. రాత్రి 12 గంటలకు కొత్తసంవత్సరానికి స్వాగతం పలికేలా బాణసంచా పేల్చడంతో పాటు కేక్లు కట్ చేసేందుకు ప్రతి హోటల్లోనూ ఏర్పాట్లు సాగుతున్నాయి. బెంగళూరులో 9వేల మంది దాకా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ప్రతాపరెడ్డి(Prathapara Reddy) తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచే నగర వ్యాప్తంగా ఉండే ఫ్లైఓవర్లు మూసివేస్తామన్నారు. సంచారం కోసం రాత్రి 2 గంటల దాకా కొనసాగించనున్నారు. ప్రత్యేకించి ఎంజీ రోడ్ ప్రాంతమంతా వాహనాల పార్కింగ్కు అవకాశం లేకుండా చేశారు. నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోనూ పోలీసులు అప్రమత్తంగా ఉండేలా విధులకు కేటాయించారు. మైసూరులో కొత్తసంవత్సర వేడుకలకు ఆంక్షలు ఉంటాయని ప్రజలు సహకరించాలని నగర పోలీసు కమిషనర్ రమేష్ బానోత్ సూచించారు. నగర వ్యాప్తంగా గురువారం పర్యటించిన కమిషనర్ హోటళ్లు, బార్లు, పబ్ల యజమానులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కొడుగు, చిక్కమగళూరు జిల్లాల పరిధిలోని స్టేహోంలు, రిసార్టులు అప్పుడే సందర్శకులతో నిండిపోయాయి. శివమొగ్గ, దక్షిణ కన్నడ జిల్లాల వ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉడుపి, ఉత్తరకన్నడ, మంగళూరు పరిధిలోని బీచ్ల వద్ద సముద్రంలోకి వెళ్లకుండా కట్టడి చేయదలచారు. ఇక రాష్ట్రమంతటా అన్ని జిల్లాలలోను కొత్తసంవత్సర వేడుకలను స్వాగతించేందుకు ఏర్పాట్లు సాగుతుండగా పోలీసుల నిబంధనలు పాటించేలా ప్రచారాలు సాగుతున్నాయి.