వ్యాపార అభివృద్ధికి 8 వ్యూహాత్మక పిల్లర్లు: మమతా బెనర్జీ
ABN , First Publish Date - 2022-04-20T20:51:26+05:30 IST
మేము ప్రజలను కులం, మతం, సిద్ధాంతాల ఆధారంగా విభజించబోము. మనమంతా ఒకే కుటుంబంలా ఉండాలని చూస్తాము. దేశంలోని ఏం ప్రాంతం వారైనా బెంగాల్లో ఉంటే వారిని మా కుటుంబంలో ఒకరిగానే చూసుకుంటాం. వారు ఇక్కడ హాయిగా ఉండొచ్చు...

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో వ్యాపార అభివృద్ధికి తాము వ్యూహాత్మకంగా ఎనిమిది పిల్లర్లకు అంకురార్పణ చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బుధవారం రాష్ట్ర రాజధాని కోల్కతాలో బెంగాల్ బిసినెస్ సమ్మిట్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మమత, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కొవిడ్ తర్వాత మొట్టమొదటి సారిగా వ్యాపార వేత్తలతో భౌతిక సమావేశం ఏర్పాటు చేసిన ఘనత తమదేనని మమత పేర్కొన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘మేము ప్రజలను కులం, మతం, సిద్ధాంతాల ఆధారంగా విభజించబోము. మనమంతా ఒకే కుటుంబంలా ఉండాలని చూస్తాము. దేశంలోని ఏం ప్రాంతం వారైనా బెంగాల్లో ఉంటే వారిని మా కుటుంబంలో ఒకరిగానే చూసుకుంటాం. వారు ఇక్కడ హాయిగా ఉండొచ్చు. వ్యాపార సౌలభ్యాల విషయంలో కూడా మేము ఇలాగే వ్యవహరిస్తాం. బెంగాల్లో వ్యాపార అభివృద్ధికి తాము వ్యూహాత్మకంగా ఎనిమిది పిల్లర్లకు అంకురార్పణ చేస్తున్నాం. మొదటిది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, రెండోది సరైన విద్య, మూడోది సామాజిక భద్రత, నాలుగోది నైపుణ్యాభివృద్ధి, ఐదోది మౌలిక సదుపాయాలను విస్తరించడం, ఆరోది వ్యాపార సైలభ్యం, ఏడోది డిజిటలైజేషన్, ఎనిమిదోది స్ట్రైక్ లేకుండా చూడడం. ఈ ఎనిమిది విధానాలతో బెంగాల్లో మరింత పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తాం’’ అని మమతా బెనర్జీ అన్నారు.