60 అడుగుల ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు
ABN , First Publish Date - 2022-04-09T21:57:11+05:30 IST
ఈ విషయమై ఏప్రిల్ 7న నర్సిగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. వాస్తవానికి 1972లో అర్ర కెనాల్పై నిర్మించి ఈ వంతెనను ప్రస్తుతం ఉపయోగించడం లేదు. పూర్తి ఇనుముతో నిర్మించిన ఈ వంతెన పూర్తి పాడవడంతో ప్రమాదకరమైన వంతెనగా ప్రకటించి వదిలేశారు..
పాట్నా: హిందీలో వచ్చిన స్పెషల్-26 అనే సినిమాలో హీరో ముఠా చాలా విచిత్రంగా దొంగతనాలు చేస్తుంటుంది. సీబీఐ, ఏసీబీ అధికారులలాగ వచ్చి పత్రాల్లోలేని ఆస్తులన్నింటినీ జప్తు చేస్తున్నట్లు నటించి సంపద అంతా లూటీ చేస్తారు. బిహార్లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఆ సినిమాలోలాగ డబ్బు తీసుకెళ్లలేదు కానీ, తాము నీటిపారుదల శాఖ అధికారులమని 60 అడుగుల పాడుబడ్డ వంతెనను ఎత్తుకెళ్లారు. బిహార్లోని రోతాస్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసు ఫిర్యాదు అనంతరం కానీ ఇది దొంగతనం అని తెలియకపోవడం గమనార్హం.
ఈ విషయమై ఏప్రిల్ 7న నర్సిగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. వాస్తవానికి 1972లో అర్ర కెనాల్పై నిర్మించిన ఈ వంతెనను ప్రస్తుతం ఉపయోగించడం లేదు. పూర్తి ఇనుముతో నిర్మించిన ఈ వంతెన పూర్తి పాడవడంతో ప్రమాదకరమైన వంతెనగా ప్రకటించి వదిలేశారు. తొందరలోనే ఈ వంతెనను కూల్చేయాలని కూడా అనుకున్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇంతలో ఇరిగేషన్ అధికారులమని వచ్చిన కొంత మంది దొంగలు.. జేసీబీ, లారీలు, గ్యాస్ కట్టర్లు తీసుకువచ్చి 3 రోజుల పాటు శ్రమించి వంతెనను దొంగిలించారు. సమీప ఊర్లో ఉన్న వారు, సమీప అధికారులెవరికీ ఇది దొంగతనం అని అనుమానం రాలేదు. ఈ దొంగతనానికి ముందు కూడా ఈ వంతెనలోని అనేక భాగాలు దొంగతనానికి గురవుతూ వస్తున్నాయి.