Nalini : 3 దశాబ్దాల పోరాటం.. బిడ్డ కోసం ఆరాటం

ABN , First Publish Date - 2022-11-12T04:05:51+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా మూడు దశాబ్దాలకు పైగా జైలుశిక్ష అనుభవించిన 53 ఏళ్ల నళిని జీవితం ఆద్యంతం మలుపులతో కూడుకున్నది.

Nalini : 3 దశాబ్దాల పోరాటం.. బిడ్డ కోసం ఆరాటం

నళిని జీవితంలో ఎన్నో మలుపులు

చెన్నై, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా మూడు దశాబ్దాలకు పైగా జైలుశిక్ష అనుభవించిన 53 ఏళ్ల నళిని జీవితం ఆద్యంతం మలుపులతో కూడుకున్నది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబాలవనపురానికి చెందిన మలయాళ కుటుంబం వారిది. ఆమె తండ్రి శంకర నారాయణన్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా, తల్లి పద్మావతి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేశారు. నళినికి ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. చెన్నైలోని యతిరాజ్‌ కాలేజీలో బీఏ చేసిన నళిని అనంతరం ఓ ప్రైవేటు సంస్థలో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగం చేసేది. 1991 ఫిబ్రవరిలో శ్రీలంక జాతీయుడైన మురుగన్‌తో నళినికి పరిచయమైంది. ఆమెను విపరీతంగా ఆకర్షించిన మురుగన్‌ ఎల్టీటీఈ వైపు ఆమెను మళ్లించాడు. అనంతరం వారి మనసులు కలవడంతో వివాహం చేసుకున్నారు. 1991 మే 21వ తేదీన రాజీవ్‌గాంధీ హత్యలో ఆమె పాల్గొన్నారు. ప్రధాన సూత్రధారి శివరాజన్‌, శుభ, థాను (మానవబాంబు), హరిబాబు (ఫొటోగ్రాఫర్‌) తదితరులతో కలిసి నళిని శ్రీపెరంబుదూర్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్‌ బహిరంగ సభకు వెళ్లింది. శుభతో కలిసి ఆమె జనంలోనే కూర్చుంది. థాను తననుతాను పేల్చుకోవడంతో 15 మంది మృతి చెందారు. అనంతరం అదే ఏడాది జూన్‌ 14వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందం స్థానిక సైదాపేట బస్టాండు వద్ద నళిని దంపతులను అరెస్టు చేసింది. నళిని జైల్లోకి అడుగు పెట్టేనాటికి ఆమె రెండు నెలల గర్భిణి. 1992 జనవరి 21న ఆమె జైలులోనే ఆడబిడ్డను ప్రసవించగా, ఆమెకు మేఘర అని పేరు పెట్టారు.

అయితే, రెండేళ్ల వరకు ఆ బిడ్డను చూసేందుకు ఆమెకు అనుమతి లభించలేదు. అనంతరం అనంతరం బిడ్డను చూసేందుకు అనుమతి ఇచ్చారు. మేఘర ఆరేళ్లప్రాయంలో జైలు నుంచి బయటకు వచ్చింది. నళిని కుటుంబీకులు మేఘర పేరును హరితగా మార్చి లండన్‌ తీసుకెళ్లారు. అక్కడే ఆమె మెడిసిన్‌ చేసి, డాక్టర్‌గా ప్రాక్టీసు చేస్తోంది. 2008 మార్చి 19వ తేదీన రాజీవ్‌గాంధీ కుమార్తె ప్రియాంక వేలూరు సెంట్రల్‌ జైలుకెళ్లి నళినితో మాట్లాడారు. కానీ, హత్యకు తన భర్త, ఆయన సన్నిహితులు చేసిన కుట్ర గురించి తనకు తెలియదని ఆ సందర్భంగా నళిని వాపోయింది. నళిని జైలులో ఉండగానే 2009లో ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ చేసింది. నళిని, ఆమె భర్త మురుగన్‌ వేలూరు సెంట్రల్‌ జైల్లోనే ఉండడంతో ప్రతి 15 రోజులకొకమారు కలుసుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. అయితే గత ఐదేళ్లుగా మురుగన్‌ కాషాయ దుస్తులు ధరిస్తూ సన్యాసి అవతారమెత్తాడు. తనకు కలలో దేవుళ్లు కనిపిస్తున్నారని చెబుతున్నాడు. తనను విడుదల చేయాలంటూ పలుమార్లు నిరాహారదీక్షలు కూడా చేశాడు.

Updated Date - 2022-11-12T12:20:28+05:30 IST