Maharashtra political crisis: రెబల్స్ క్యాంప్లోకి మరో ఏడుగురు ఎమ్మెల్యేలు.. ముదిరిన సంక్షోభం
ABN , First Publish Date - 2022-06-23T15:23:42+05:30 IST
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharashtra political crisis) నిమిషనిమిషానికి మరింత ముదురుతోంది.
ముంబై/గువహటి : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharashtra political crisis) మరింత ముదిరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే(Uddav Thackeray) అధికారిక నివాసం నుంచి సొంత నివాసం మాతోశ్రీకి తరలివెళ్లిన నేపథ్యంలో తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సారధ్యంలోని రెబల్స్ క్యాంప్లో ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగింది. గురువారం ఉదయం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ క్యాంప్లో చేరారు. అంతకుముందు బుధవారం పొద్దుపోయాక నలుగురు ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు క్యాంప్లో చేరారు. దీంతో 24 గంటల వ్యవధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బ్యాచ్లో చేరినట్టయింది. రెబల్స్ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 46కి(స్వతంత్ర ఎమ్మెల్యులు కలుపుకుని) పెరిగింది. వీరంతా గువహటిలోని రాడీసన్ బ్లూ హోటల్లో బస చేస్తున్నారు. ఫలితంగా అధికార మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వంలో మరింత అస్థిరత నెలకొంది.
రెబల్ ఎమ్మెల్యేల తీర్మానం..
శివసేన పక్షనేతగా ఏక్నాథ్ షిండే కొనసాగుతారని పేర్కొంటూ రూపొందించిన తీర్మానాన్ని రెబల్ ఎమ్మెల్యేలు ఆమోదించారు. ఈ మేరకు 34 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీకి పంపించారు. పార్టీలో రెండొంతుల ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకునేందుకు గవర్నర్ ముందుకు ఏక్నాథ్ షిండే వెళ్లే అవకాశాలున్నాయని పలు రిపోర్టులు వెలువడుతున్నాయి. కాగా ఏక్నాథ్ షిండేను పార్టీ పక్షనేతగా తొలగిస్తూ శివసేన నాయకత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెబల్స్ తీర్మానాన్ని రూపొందించి ఆమోదించారు.
బయటకు రావాల్సిందే..
ఠాక్రే వెబ్ సందేశం ఇచ్చిన కొన్నిగంటల తర్వాత తిరుగుబాటు నేత షిండే ఒక ప్రకటన చేశారు. ‘‘మహావికాస్ అఘాడీ ఒక అసహజమైన కూటమి. శివసేన తన కోసం, తన పార్టీ కార్యకర్తల కోసం ఆ కూటమి నుంచి బయటకు రావడం తప్పనిసరి. రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు. ఈ కూటమి వల్ల కాంగ్రెస్, ఎన్సీపీకే లాభం చేకూరిందని.. ఆ రెండు పార్టీలూ బలపడుతుండగా శివసేన వ్యవస్థాగతంగా బలహీనపడుతూ వచ్చిందని, గత రెండున్నరేళ్లుగా సగటు శివసైనికులు ఎన్నో బాధలు పడ్డారని షిండే ఆవేదన వెలిబుచ్చారు.