Munugode Election Results: మునుగోడు: కేసీఆర్ కంటే మోజార్టీ ఓట్లు సాధించిన సబితా ఇంద్రారెడ్డి

ABN , First Publish Date - 2022-11-06T21:40:40+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇన్‌చార్జిగా ఉన్న నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 254 ఓట్ల మెజార్టీ వచ్చింది.

Munugode Election Results: మునుగోడు: కేసీఆర్ కంటే మోజార్టీ ఓట్లు సాధించిన సబితా ఇంద్రారెడ్డి

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇన్‌చార్జిగా ఉన్న నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 254 ఓట్ల మెజార్టీ వచ్చింది. సీఎం కేసీఆర్‌ పోలింగ్‌కు ముందు ప్రచారంలో భాగంగా ఫోన్‌లో లెంకలపల్లి గ్రామస్థులతో మాట్లాడి ఆ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 254 ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం 1927 ఓట్లు ఉండగా 1816 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 254 ఓట్లు లీడ్‌ వచ్చింది. గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ తరుపున లెంకలపల్లి గ్రామంలో నెల రోజుల పాటు ఉన్నారు. గజ్వేల్‌కు చెందిన తన అనుచరులు 250 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పెద్దఎత్తున ప్రచారం చేశారు.

ఆ గ్రామంలో కాల్వ దాటేందుకు బ్రిడ్జి లేకపోడంతో బ్రిడ్జిని నిర్మించడంతో పాటు దళితబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చి ప్రచారం చేశారు. ఇక మర్రిగూడ మండలంలో మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహించారు. మండల కేంద్రంలో 2844 ఓట్లకు గానూ 2530 ఉండగా 613 ఓట్లు లీడ్‌ వచ్చాయి. ఇక పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్‌ మండలంలో ఎంపీటీసీ-1,2ల స్థానాల్లో ప్రచారం చేయగా ఎంపీటీసీ-1 పరిధిలో టీఆర్‌ఎస్‌కు 47 ఓట్లు, ఎంపీటీసీ-2 పరిధిలో 18 ఓట్ల లీడ్‌ లభించింది. అదేవిధంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న పసునూరు గ్రామంలో 332 ఓట్ల మెజార్టీ లభించింది.

Updated Date - 2022-11-06T21:43:05+05:30 IST