రాజగోపాల్‌రెడ్డికి జ్వరం

ABN , First Publish Date - 2022-10-26T06:37:59+05:30 IST

మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

రాజగోపాల్‌రెడ్డికి జ్వరం

సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు/మునుగోడు రూరల్‌, అక్టోబరు 25: మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతతోనే ఆయన సోమ, మంగళవారాల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందిన ఆయన రోజంతా విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రానికి ఆరోగ్యం కొంత మెరుగవడంతో సోమవారం రాత్రి, మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సోమవారం యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పొర్లగడ్డ తండా, కడపగండితండా, వాచ్యతండా, రాధానగర్‌తండా, డాకుతండా, గంగమూలతండా, వెంకంబాయి తండాల్లో ఇంటింటికీ వెళ్లి, ప్రజలను కలిసి, తనను గెలిపించాలని విన్నవించారు. దీపావళి సందర్భంగా వెంకంబాయి తండాలో తన సతీమణి లక్ష్మితో కలిసి పూజల్లో పాల్గొన్నారు. టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో జరిగే ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించేదన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను బతికి ఉన్నంతకాలం నిరంతరం మునుగోడు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని రాజగోపాల్‌రెడ్డి వివరించారు.

నాన్నా.. నిన్ను చూసి గర్వపడుతున్నా: సంకీర్త్‌రెడ్డి

‘నాన్నా.. నిన్ను చూసి గర్వపడుతున్నా, మొత్తం అసెంబ్లీనే మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి మీరు తీసుకొచ్చారు, ఇప్పటికే మునుగోడు ప్రజలు విజయం సాధించారు’ అంటూ రాజగోపాల్‌రెడ్డి తనయుడు సంకీర్త్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘అధికార టీఆర్‌ఎస్‌ నుంచి 84మంది ఎమ్మెల్యేలు, 16మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 8 నుంచి 10 మంది ఎంపీలు, అంతులేని సంపద, పోలీసు పవర్‌తో ఒక వ్యక్తి(రాజగోపాల్‌రెడ్డి)ని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ప్రజలు గెలిపించారు’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-10-26T08:24:28+05:30 IST