Himchal Results: ఛండీగఢ్‌కు హుటాహుటిన కాంగ్రెస్ పరిశీలకులు

ABN , First Publish Date - 2022-12-08T17:14:14+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు తమ ఖాతాలో వేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆ పార్టీ కేంద్ర అధిష్ఠానం వేగంగా..

Himchal Results: ఛండీగఢ్‌కు హుటాహుటిన కాంగ్రెస్ పరిశీలకులు

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ (Himachal pradesh) ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు తమ ఖాతాలో వేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆ పార్టీ కేంద్ర అధిష్ఠానం వేగంగా పావులు కదుపుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టే అవకాశాలు ఉండవచ్చనే అనుమానాలు ఉండటంతో ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఛండీగఢ్‌కు తరలించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో వారిని కలిసేందుకు పార్టీ పరిశీలకులుగా (observers) దిగ్గజ నేతలు ఛండీగఢ్‌కు వెళ్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ పరిశీలకుడుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌, భూపిందర్ హుడా, కాంగ్రెస్ ఇన్‌చార్జి రాజీవ్ శుక్లా వంటి సీనియర్ నేతలకు పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యత అప్పగించింది. బఘెల్, శుక్లాలు గురువారం సాయంత్రానికే ఛండీగఢ్ చేరుకోనున్నారు. హుడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

''మేము ఛండీగఢ్‌కు మా నేతలను తరలిస్తున్నాం. వారిని బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు, బేరసారాలు చేసేందుకు అవకాశాలున్నాయి. బీజేపీ గతంలో ఇలాంటి పనులు చాలాసార్లే చేసింది'' అని హిమాచల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి తేజిందర్ సింగ్ బిట్టు ఇంతకుముందు మీడియాకు తెలిపారు.

Updated Date - 2022-12-08T17:14:15+05:30 IST