భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం: కాంగ్రెస్
ABN , First Publish Date - 2022-02-15T17:22:23+05:30 IST
గోవాలో భారీ పోలింగ్ శాతం నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం ..
పనజి: గోవాలో భారీ పోలింగ్ శాతం నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. తాము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడానికి ఇది గట్టి సంకేతమని పేర్కొంది. 40 అసెంబ్లీ నియోకవర్గాలకు ఒకే విడతలో సోమవారం జరిగిన గోవా ఎన్నికల్లో 78.94 శాతం పోలింగ్ నమోదైంది. సాంక్వెలిమ్ నియోజకవర్గంలో గరిష్టంగా 89.61 శాతం, బెనౌలిమ్ నియోజకవర్గంలో కనిష్టంగా 70.2 శాతం పోలింగ్ నమోదైంది. నార్త్గోవాలో 79 శాతం, సౌత్ గోవాలో 78 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన పార్టీలన్నీ ఎవరి అంచనాల్లో అవి ఉన్నాయి.
గోవాలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీచినట్టు కాంగ్రెస్ చెబుతోంది. ''ప్రజలు బీజేపీని సాగనంపాలని అనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాల బలంగా వీచాయి. ఆ కారణంగానే భారీగా పోలింగ్ నమోదైంది. ఇది కాంగ్రెస్కు చాలా బాగా కలిసిరానుంది. పూర్తి మెజారిటీ రాబోతోంది. జనం కూడా ఇదే చెబుతున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలనే భారీ ఓటింగ్ రూపంలో చెప్పారు'' అని ఏఐసీసీ గోవా ఇన్చార్జి దినేష్ గుండూరావు అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమోద్ మహాజన్పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటమే సాంక్వెలిమ్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడానికి కారణమన్నారు. ఓడిపోతామనే భయంతోనే ప్రమోద్ మహాజన్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారని అన్నారు.
గోవా ఎన్నికల్లో గోవా ఫార్వార్ట్ పార్టీ (జీఎఫ్పీ)తో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. తమ కాంబినేషన్ విజయవంతంగా సాగిందని, కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించే దిశగానే ఫలితాలు ఉంటాయని గుండూరావు చెప్పారు. సుస్ధిర ప్రభుత్వం కోరుతూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఇది నిశ్శబ్ద విప్లవమని, 'ఆయా రామ్ గయా రామ్' రాజకీయాలకు గోవా ప్రజలు చెల్లుచీటీ చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20 ప్లస్ సీట్లు వస్తాయని, బీజేపీ సింగిల్ డిజిట్ కూడా దాటదని గుండూరావు ధీమా వ్యక్తం చేశారు.