ర్యాలీలు, రోడ్షోలపై ఫిబ్రవరి 11 వరకూ నిషేధం పొడిగింపు: ఈసీ
ABN , First Publish Date - 2022-01-31T22:15:52+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో ఫిజికల్ ర్యాలీలు, రోడ్షోలపై విధించిన..

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో ఫిజికల్ ర్యాలీలు, రోడ్షోలపై విధించిన నిషేధాన్ని మరోసారి ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారంనాడు పొడిగించింది. ఫిబ్రవరి11వ తేదీ వరకూ నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఫిజికల్ ర్యాలీలపై నిషేధం పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కోవిడ్ పరిస్థితిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే సమగ్ర సమీక్ష జరిపారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు.
నూతన మార్గదర్శకాలు
ఫిజికల్ పబ్లిక్ మీటింగులు, ఇండోర్ మీటింగులు, ఇంటింటి ప్రచారాలకు సంబంధించిన కొన్ని సడలింపులను ఈసీ ప్రకటించింది. ఫిజికల్ ర్యాలీల్లో గరిష్టంగా 1,000 మంది వరకూ అనుమతిస్తారు. ఇండోర్ మీటింగ్లకు 500 మందిని, డోర్-టు-టోర్ ప్రచారానికి 20 మందిని అనుమతిస్తారు. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10, మార్చి 7వ తేదీ మధ్య జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.