Gujarat polls: 2024లో 400 లోక్‌సభ సీట్లు గెలుస్తాం

ABN , First Publish Date - 2022-11-28T16:24:38+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు ఒక ప్రాక్టీస్ అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ..

Gujarat polls: 2024లో 400 లోక్‌సభ సీట్లు గెలుస్తాం

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు ఒక ప్రాక్టీస్ అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) అన్నారు. గుజరాత్ ఎన్నికల అనంతరం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికకావడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము (BJP) 400 సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల కారణంగానే వారి హయాంలో ఉగ్రవాదం పెచ్చరిల్లిందని, 2014 తర్వాత ఉగ్రవాదానికి తాము గట్టి సమాధానం ఇచ్చామని శర్మ అన్నారు. పీఎఫ్ఐ‌ను నిషేధించడంపై మాట్లాడుతూ, ఈ చర్య దేశాన్ని దెబ్బతీస్తుందని కొందరు చెబుతూ వచ్చారని, అయితే అలాంటిదేమీ జరగలేదని అన్నారు. 370వ అధికరణ రద్దు చేసినప్పుడూ కూడా ఇదే మాట అన్నారని, అయితే అలాంటివేవీ చోటుచేసుకోలేదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి (UCC) అంశంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు.

యాంటీ-రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంపై అడిగినప్పుడు, సమస్య మొదలుకాక ముందే దానికి ముకుతాడు వేయడమే తమ ఉద్దేశమని, అది వ్యాక్సిన్‌లా పనిచేస్తుందని అన్నారు. హిందూ పోలరైజేషన్‌పై అడిగినప్పుడు..."హిందూ పోలరైజేషన్‌తో వచ్చే సమస్య ఏమిటి? ఒవైసీ మాత్రమే మాట్లాడాలా? తమ గొప్పతనం చాటుకునే హక్కు హిందువులకు లేదా?'' అని శర్మ ప్రశ్నించారు. కాంగ్రెస్ బుజ్జగింపు విధానాల కారణంగానే అఫ్తాబ్ పూనావాలా వంటి వాళ్లు తలెత్తుతుంటారని శ్రద్ధ వాకర్ హత్యకేసును ప్రస్తావిస్తూ ఆయన ఆరోపించారు.

ఖర్గే పర్యటన మంచిదే...

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుజరాత్‌కు పర్యటనకు రావడం మంచిదేనని ఒక ప్రశ్నకు సమాధానంగా శర్మ అన్నారు. తాను 22 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్నానని, గాంధీ కుటుంబం పేరు తప్పితే మరొకరు పేరు తాను వినలేదని అన్నారు. ఇప్పుడు గుజరాత్‌కు ఖర్గే రావడం మంచిదేనని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-11-28T16:24:39+05:30 IST