Munugode Bypoll results live: మునుగోడులో తెలంగాణ మంత్రులు అట్టర్‌ ఫ్లాప్

ABN , First Publish Date - 2022-11-06T15:54:01+05:30 IST

మునుగోడు (Munugode)ను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ తీవ్రంగా కృషి చేసింది. కృషి ఫలితంగా ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Munugode Bypoll results live:  మునుగోడులో తెలంగాణ మంత్రులు అట్టర్‌ ఫ్లాప్

మునుగోడు: మునుగోడు (Munugode)ను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ తీవ్రంగా కృషి చేసింది. కృషి ఫలితంగా ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు మొత్తం కేబినెట్‌ను సీఎం కేసీఆర్ మునుగోడులో దింపారు. గ్రామాల వారిగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఈ గ్రామాల్లో ఓటర్లు బీజేపీకే సపోర్టు చేశారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని 2, 3 వార్డులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (Srinivas Goud), చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం గ్రామానికి మంత్రి మల్లారెడ్డి (Malla Reddy), డి.నాగారం గ్రామానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియమించారు. అయితే మంత్రులకు అప్పగించిన గ్రామాల్లో అట్టర్‌ ఫ్లాప్ అయ్యారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఇన్‌చార్జ్‌లుగా ఉన్న గ్రామాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి ఇన్‌చార్జ్‌లుగా ఉన్న గ్రామాల్లో కూడా బీజేపీ ఆధిక్యం కనబర్చడం టీఆర్‌ఎస్‌ను విస్మయానికి గురిచేసింది. అంతేకాదు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత ఊరిలో ఆయనకు నిరాశ ఎదురైంది. ఆయన సొంత గ్రామమైన కూసుకుంట్ల స్వగ్రామం లింగవారిగూడెంలో బీజేపీ ఆధిక్యం కనబర్చింది.

ఎవరెవరు ఎక్కడంటే..?

మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కో ప్రాంతాన్ని కేటాయించారు. ప్రతి ఎంపీటీసీ పరిధిని ఒక మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్లో ఎవరో ఒకరికి అప్పగించారు. ఒక్కో ఎంటీపీసీ పరిధిలో 2,500-3,000 మంది వరకు ఓటర్లున్నారు. మునిసిపాలిటీల్లో ప్రతి రెండు వార్డులకు ఒకరు, ఒక్కో ఎంపీటీసీ పరిధిలో ఒకరి చొప్పున పార్టీలోని కీలక నేతలకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. చండూరు మునిసిపాలిటీలో 10 వార్డులుంటే ఐదుగురు ఎమ్మెల్యేలను బాధ్యులుగా నియమించారు. చండూరు మండలానికి 11 మందిని ఇన్‌చార్జులుగా వేశారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో 10 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. చౌటుప్పల్‌ మండలానికి 12 మందిని ఇన్‌చార్జులుగా నియమించారు. మర్రిగూడ మండలానికి 11 మంది, మునుగోడు మండలానికి 13 మంది, నాంపల్లి మండలానికి 11 మంది, నారాయణపురం మండలానికి 13 మందిని వేశారు. చండూరు మండలం గట్టుప్పల్‌ గ్రామానికి మంత్రి కేటీఆర్‌, చండూరు మునిసిపాలిటీలో 2, 3 వార్డులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని 2, 3 వార్డులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం గ్రామానికి మంత్రి మల్లారెడ్డి, డి.నాగారం గ్రామానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రిగూడకు మంత్రి హరీశ్‌ రావు, డి.బి పల్లికి మంత్రి నిరంజన్‌రెడ్డి, నాంపల్లి మండల కేంద్రంలో ఒక ప్రాంతానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అదే మండలం పసునూరుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నారాయణపూర్‌ మండల కేంద్రంలోని ఓ భాగానికి మంత్రి గంగుల కమలాకర్‌, అదే మండలం పొర్లగడ్డ తండాకు మంత్రి సత్యవతి రాథోడ్‌, సర్వేల్‌ గ్రామంలో ఓ భాగానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.

Updated Date - 2022-11-06T16:23:28+05:30 IST