అంబులెన్సులు.. కాన్వాయిల్లో మూటలు

ABN , First Publish Date - 2022-11-03T03:53:18+05:30 IST

‘‘మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు విపరీతంగా డబ్బులను పంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

అంబులెన్సులు.. కాన్వాయిల్లో మూటలు

ఓటుకు 10 వేల నుంచి 30 వేల దాకా పంచే ప్రయత్నం

దాడులు చేయిస్తున్న కేసీఆర్‌వి చిల్లర చేష్టలు: బండి సంజయ్‌

మంత్రుల కాన్వాయిల్లో డబ్బుల మూటలు

చాదర్‌ఘాట్‌/మన్సూరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు విపరీతంగా డబ్బులను పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో ఓటుకు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు పంచేందుకు డబ్బులను అంబులెన్సులలో, మంత్రుల కాన్వాయిల్లో తరలిస్తున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్‌ నేత ఎం.రమేశ్‌ యాదవ్‌ను, చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో అక్టోబరు 31న జరిగిన దాడిలో గాయపడి వనస్థలిపురంలోని ఇవ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్‌ కార్యకర్త మన్నె ప్రతా్‌పరెడ్డిని ఆయన పరామర్శించారు.

ఆయన వెంట మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రచారం గడువు ముగిసినా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నా ఎన్నికల కమిషన్‌, పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప ఎన్నికలో గెలవడానికి సీఎం కేసీఆర్‌ చిల్లర చేష్టలు చేస్తున్నాడని, బీజేపీ కార్యకర్తలపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులు చేయిస్తూ.. ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేశాడని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-11-03T03:56:32+05:30 IST