Notification soon: నర్సులకు తీపి కబురు
ABN , First Publish Date - 2022-12-14T11:03:43+05:30 IST
నర్సింగ్ విద్యార్థుల (Nursing students)కు తీపి కబురు. నర్సు పోస్టుల భర్తీకి ఐదేళ్ల తర్వాత రంగం సిద్ధమైంది
నర్సు పోస్టులు 4,722
ఖాళీల భర్తీకి వారంలోగా నోటిఫికేషన్
ఎంహెచ్ఎస్ఆర్బీ కసరత్తు పూర్తి
పరీక్షల బాధ్యత జేఎన్టీయూకు?
కాంట్రాక్ట్ నర్సులకు వెయిటేజీ!
రెండు నెలల్లోనే ప్రక్రియ పూర్తి
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్ విద్యార్థుల (Nursing students)కు తీపి కబురు. నర్సు పోస్టుల భర్తీకి ఐదేళ్ల తర్వాత రంగం సిద్ధమైంది. ఏకంగా 4,722 నర్సు పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఈ పోస్టులన్నీ రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 4,722 పోస్టుల్లో అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3823, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలో 757, ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిలో 81, ఆయుష్ విభాగంలో 61 పోస్టులు ఉన్నాయి. మొత్తం ప్రక్రియను రెండు నెలల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ విధానంలో నర్సుల భర్తీకి 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. అదే నర్సు పోస్టుల భర్తీకి చివరి నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లోని లోపాలపై కొంత మంది కోర్టులో కేసులు వేయడంతోపాటు వెయిటేజీ మార్కులపై వైద్య శాఖకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ పరిష్కరించాక, 2021లో తుది జాబితా విడుదల చేసి, నర్సులకు పోస్టింగ్లు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా నర్సు పోస్టుల భర్తీని మెడికల్ బోర్డు ద్వారానే చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. నర్సింగ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 60వేలమంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
నేడో, రేపో వైద్య పోస్టుల తుది జాబితా
వైద్య ఆరోగ్యశాఖలోని 10 వేల పోస్టులను మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ ఏడాది జూన్ 15న 969 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 15 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 4,900 దరఖాస్తులు రాగా, నవంబరు 9న ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. నవంబరు చివరి వారంలో అభ్యర్ధుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఈ మేరకు తుది జాబితాను మెడికల్ బోర్డు ప్రభుత్వానికి పంపగా.. బుధ, గురువారాల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక, ఈ నెల 6న 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నీ కూడా వైద్య విద్య సంచాలకుల పరిధిలోనివే. 2,116 డాక్టర్ పోస్టులను రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న మెడికల్ బోర్డు.. మూడో నోటిఫికేషన్ ద్వారా 4,722 నర్సు పోస్టులను భర్తీ చేయనుంది.