Notification: నిరుద్యోగుల నిరీక్షణకు తెర! ఎన్ని ఖాకీ పోస్టులంటే..

ABN , First Publish Date - 2022-11-29T14:02:40+05:30 IST

రాష్ట్రం(Andhra Pradesh)లో నిరుద్యోగుల నిరీక్షణకు ఏపీ పోలీసు శాఖ(AP Police Department) మూడున్నరేళ్ల తర్వాత తెరదించింది. ఏటా ఆరున్నర వేల మందికి పోలీసు ఉద్యోగాలు

Notification: నిరుద్యోగుల నిరీక్షణకు తెర! ఎన్ని ఖాకీ పోస్టులంటే..
ఎన్ని ఖాకీ పోస్టులంటే..

6,511 ఖాకీ కొలువులు

ఎట్టకేలకు పోలీస్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ

ఎస్‌ఐ పోస్టులు 411, కానిస్టేబుల్‌ 6,100

సివిల్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ అమలు

హోంగార్డులకు 15-25% రిజర్వేషన్‌

రేపటి నుంచి డిసెంబరు 28 వరకు కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తులు

డిసెంబరు 12 నుంచి ఎస్‌ఐ పోస్టులకు

జనవరి 22న కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష

ఫిబ్రవరి 19న ఎస్‌ఐ పోస్టుల ప్రిలిమినరీ

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం(Andhra Pradesh)లో నిరుద్యోగుల నిరీక్షణకు ఏపీ పోలీసు శాఖ(AP Police Department) మూడున్నరేళ్ల తర్వాత తెరదించింది. ఏటా ఆరున్నర వేల మందికి పోలీసు ఉద్యోగాలు(Police Jobs) కల్పిస్తామంటూ 2019లో జగన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, అప్పటి నుంచి ఈ మాటెత్తని సర్కారు.. తాజాగా తొలి అడుగు వేసింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు నోటిఫికేషన్‌(Police Notification) జారీ చేసింది. సివిల్‌ ఎస్‌ఐ 315, రిజర్వ్‌ ఎస్‌ఐ 96 కలిపి మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులు, సివిల్‌ కానిస్టేబుల్‌ 3,580, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ 2,520 మొత్తం 6,100 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వివరించింది. 4 దశల్లో నిర్వహించే నియామక ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.

మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 19న జరిగే రాత పరీక్షతో ముగియనుంది. ప్రిలిమినరీ, ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ప్రధాన పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తారు. కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 30 నుంచి డిసెంబరు 28 వరకు స్వీకరించనున్నారు. అర్హులకు జనవరి 9 నుంచి హాల్‌ టిక్కెట్లు జారీ చేసి 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి పరీక్షకు అర్హత సాధిస్తారు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించి.. ఫిబ్రవరి 5 నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తారు. అదే నెల 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిసారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 1 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్లో రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులు, రెండో పేపర్లో ఆబ్జెక్టివ్‌ రూపంలో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పీఈటీలో 100 మార్కులు ఉంటాయి.

పోస్టుల వివరాలిలా...

సివిల్‌ ఎస్‌ఐ పోస్టులు 315(మహిళ/పురుష అభ్యర్థులు), ఏపీఎస్పీ రిజర్వ్‌ ఎస్‌ఐ పోస్టులు 96.. సివిల్‌ కానిస్టేబుల్‌ 3,580(స్త్రీ/పురుషులు). స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ 2,520 పోస్టులు ఉన్నాయి. సివిల్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల్లో మహిళలకు 33.33ు, సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో హోంగార్డులకు 15ు, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్‌లో 25ు రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు. అన్ని పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్‌, ఎన్‌సీసీతోపాటు పోలీసుల పిల్లలకు నిబంధనల మేరకు 1 నుంచి 5ు రిజర్వేషన్‌ ఉంటుంది. ఎస్‌ఐ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2022 జూలై 1నాటికి 21 ఏళ్ల వయసు దాటి 27 ఏళ్లు మించరాదు. జనరల్‌, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్‌ పాసై డిగ్రీ చదివి ఉండాలి. కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులు ఇంటర్‌ విద్యార్హతతోపాటు 18-24 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల విద్యార్హతను ఇంటర్‌గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు http://slprb.ap.gov.inలో చూసుకోవచ్చు. జనరల్‌, బీసీ కోటాలో రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్‌ఐ పోస్టులకు జనరల్‌, బీసీ అయితే రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 చెల్లించాలి. దరఖాస్తు సమయంలో ఇబ్బందులు, సందేహాలుంటే 94414 50639 నంబర్‌తో సంప్రదించవచ్చు.

కానిస్టేబుల్‌ మెయిన్‌ పరీక్ష ఇలా

కానిస్టేబుల్‌ మెయిన్‌ పరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. 3 గంటల సమయం ఉంటుంది. ఆంగ్ల, అర్థమెటిక్‌, జనరల్‌ సైన్స్‌, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్‌ అఫైర్స్‌, రీజినింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు 1600 మీటర్లు, 100 మీటర్ల రన్నింగ్‌ పూర్తి చేయాలి. ఇది అర్హత కోసం తప్ప ఎలాంటి మెరిట్‌ ఉండబోదు. అయితే, ఏపీఎస్పీ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు 1,600 మీటర్లు, 100 మీటర్ల రన్నింగ్‌తోపాటు లాంగ్‌ జంప్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీనిలో సాధించే మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Updated Date - 2022-11-29T14:02:42+05:30 IST