teachers Dumma: విద్యార్థులకు అరకొర పాఠాలు!

ABN , First Publish Date - 2022-11-11T11:06:23+05:30 IST

కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు(Teachers) ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిర్ణీత సమయానికి పాఠశాలకు హాజరు కావడం దేవుడెరుగు అసలు వెళ్లడమే కష్టంగా

teachers Dumma: విద్యార్థులకు అరకొర పాఠాలు!
అరకొర పాఠాలు!

జిల్లాలో గాడి తప్పిన పాలన

పాఠశాలలకు డుమ్మా కొడుతున్న కొందరు టీచర్లు

విద్యార్థులకు అరకొర బోధనలు

చక్కదిద్దాల్సిన అధికారి అలసత్వం

జిల్లాలో విద్యా వ్యవస్థ అవస్థలు పడుతోంది. కొందరి నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన కరువవుతోంది. చక్కదిద్దాల్సిన విద్యాధికారి అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయిలో అండదండలు ఉన్నాయన్న ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు(Teachers) ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిర్ణీత సమయానికి పాఠశాలకు హాజరు కావడం దేవుడెరుగు అసలు వెళ్లడమే కష్టంగా మారింది. ఫలితంగా సర్కారు విద్యార్థులకు బోధనలు పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ స్కూళ్ల(Private schools)ను పర్యవేక్షించే నాథుడే కరువవడంతో విద్యా వ్యవస్థలో అవస్థ పాలవుతోంది.

చుట్టపు చూపుగా?

ప్రభుత్వ పాఠశాలలను గాడిన పెట్టడంలో విద్యాశాఖాధికారి కీలకపాత్ర పోషించాలి. ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టెంపరరీ రికగ్నిషన్‌ (ఈటీఆర్‌) పునరుద్ధరణ చేసుకోని పాఠశాలలను సీజ్‌ చేయాలి. కింది స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా విద్యా వ్యవస్థను చక్కదిద్దాల్సిన విద్యాధికారి విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీగా కార్యాలయానికి రాకుండా, వారానికి రెండు రోజులు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమీక్షలు, సమావేశాల పేరుతో విధులకు హాజరుకాకపోవడంతో జిల్లా విద్యారంగం అధ్వానంగా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏటా పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లా వెనకంజలో ఉండడమే ఇందుకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారే అలా ఉండడంతో కొందరు డిప్యూటీ ఈఓలు, డీఐఓఎస్‌ (మండల విద్యాధికారులు)లు సైతం విధులను పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది.

సమాచారం దొరకదు..

జిల్లాలో విద్యాశాఖకు సంబంధించిన కనీస సమాచారం దొరకడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల సంఖ్య మొదలుకుని.. విద్యార్థుల మధ్యాహ్న భోజనం, పుస్తకాల పంపిణీ, యూనిఫాంలు ఇలా.. ఎలాంటి సమాచారం అడిగినా అధికారులు పేర్కొనడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

అధిక ఫీజులు

జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లతో పాటు, సొంతంగా బుక్స్‌ ముద్రించి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నా విద్యాధికారులు చోద్యం చూస్తున్నారని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి జావిద్‌ ఆరోపించారు.

పాఠశాలలకు డుమ్మా

తమను అడిగేవారు లేరన్న ధీమాతో కొందరు ఉపాధ్యాయులు రోజువారీగా పాఠశాలలకు రాకుండా డుమ్మా కొడుతున్నారు. ప్రధానంగా చార్మినార్‌, బహదూర్‌పురా, యాకుత్‌పురా, ఆసి్‌ఫనగర్‌, గోల్కొండ, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌ మండలాల్లో ఈ తంతు కొనసాగుతోంది. ఉపాధ్యాయ సంఘాల నేతలుగా వ్యవహరిస్తున్న కొందరు నెలలో సుమారు 12 రోజులు పాఠశాలలకే రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఇతర ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది.

విధుల్లోకి తీసుకోండి : వలంటీర్ల విజ్ఞప్తి..

కరోనా పేరుతో ప్రభుత్వం జిల్లాలో 480మందిని అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడంతో రోడ్డున పడ్డామని విద్యా వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెలవారీగా వచ్చే వేతనంతో ప్రశాంతంగా కుటుంబాలను పోషించుకున్నామని, ప్రస్తుతం ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన తమను ప్రభుత్వం పట్టించుకుని తక్షణమే విధుల్లోకి తీసుకుని చేయూతనందించాలని కోరుతున్నారు. కాగా, వలంటీర్లు లేకపోవడంతో పాఠశాలల్లో బోధనలు కుంటుపడుతున్నాయని ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు.

Updated Date - 2022-11-11T12:21:20+05:30 IST