కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇండియన్ ఎకానమీ
ABN , First Publish Date - 2022-08-24T22:06:03+05:30 IST
2015 జూన్ 25న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దుతారు. నగరాల్లో పారిశుద్ధ్యం, నీటి అవసరాలు, రవాణా, ఈ-గవర్నెన్స్
బేటీ బచావో - బేటీ పడావో: 2015 జనవరి 22న ప్రారంభించారు. స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లింగ వివక్షను అంతం చేయడం, మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన పెంచడం, బాలికా సంక్షేమం, విద్యకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఆపరేషన్ స్మైల్ - ఆపరేషన్ ముస్కాన్: 2015 జనవరిలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వీధి బాలలను సంరక్షించడం, తప్పిపోయిన వారిని వారి కుటుంబాలకు చేర్చడం, పబ్లిక్ ప్రదేశాలలో వీధి పిల్లల ఫొటోలు తీసి వివరాలు సేకరించడం దీని ప్రధాన ఉద్దేశం.
సుకన్య సమృద్ధి యోజన పథకం: 2015 జనవరి 22న ప్రారంభించారు. ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం దీనిని ప్రారంభించారు. ఆడ పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి పొదుపు చేస్తారు. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల పేరు మీదుగా అకౌంట్ను పోస్టాఫీసులో గానీ, బ్యాంకులో గానీ ఓపెన్ చేసి పొదుపు కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆడపిల్లకు 14 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు జమ చేయాలి. 18 సంవత్సరాల తరవాత 50 శాతం నగదు తీసుకోవచ్చు. 21 సంవత్సరాలకు ఖాతా పూర్తవుతుంది.
భూసార కార్డు పథకం: 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు అందజేస్తారు. భూ పరీక్షల నిర్వహణ, భూసారాన్ని పెంచే చర్యలపై అవగాహన వంటివి ప్రజల్లో కల్పిస్తారు.
ప్రగతి: 2015 మార్చి 25న ప్రారంభించారు. ప్రజల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యల అమలు తీరును పర్యవేక్షించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి ప్రతి నెలా నాలుగో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన: 2015 జూలై 25న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కల్పిస్తారు. రాజీవ్గాంధీ విద్యుదీకరణ పథకాన్ని దీనిలో విలీనం చేశారు. ఈ పథకం కింద అన్ని గ్రామాలను విద్యుదీకరిస్తారు. రైతులకు, గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ను అందిస్తారు.
ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన: 2015 జూలైన 1న ప్రారంభించారు. నీరు వృథా కావడాన్ని తగ్గించి, సేద్యపు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచి నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తారు.
స్మార్ట్ సిటీ కార్యక్రమం: 2015 జూన్ 25న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దుతారు. నగరాల్లో పారిశుద్ధ్యం, నీటి అవసరాలు, రవాణా, ఈ-గవర్నెన్స్, ఆరోగ్యం, విద్య, నెట్వర్క్, సుస్థిర పర్యావరణం వంటి చర్యలు చేపడతారు. ఇండియాలో అత్యధిక స్మార్ట్ సిటీలు ఉత్తరప్రదేశ్లో ఎంపికయ్యాయి. తెలంగాణలో వరంగల్, కరీంనగర్; ఏపీలో తిరుపతి, విశాఖ, కాకినాడ నగరాలు ఎంపికైన వాటిలో ఉన్నాయి.
అమృత్: Atal Mission for Rejuvenation and Urban Transformation దీని పూర్తి పేరు. 2015 జూన్ 25న ప్రారంభించారు. లక్షకు పైగా జనాభా ఉన్న 500 నగరాలలో అవస్థాపన సదుపాయాలు అభివృద్ధి చేస్తా రు. జేఎన్ఎన్యూఆర్ఎంని దీనిలో విలీనం చేశారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన: దీనిని 2015 జూన్ 25న ప్రారంభించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా పట్టణాల్లో 2 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తారు. పట్టణాల్లోని బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో ఇంటికి రూ. 1 లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుంది.
-రాయల రాధాకృష్ణ
సీనియర్ ఫ్యాకల్టీ
