స్పందన అర్జీలకు సంతృప్తికర పరిష్కారం చూపాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-13T00:09:35+05:30 IST
స్పందన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు.
భీమవరం టౌన్, డిసెంబరు 12 : స్పందన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 184 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో వ్యయప్రయాసలతో ప్రజలు వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మన వద్దకు వస్తున్నారని, అధికారులు దీనిని దృష్టిలో ఉంచు కొని అర్జీదారులకు పూర్తి న్యాయం చేయాలన్నారు. ఒకే సమస్యపై పలుసార్లు విజ్ఞాపన వస్తే సమయం వృఽథా కావడంతో పాటు ఒత్తిడి ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఇన్చార్జి డీఆర్వో దాసిరాజు, డీఎస్పీ బి.శ్రీకాంత్, డీపీవో ఎం.నాగలత, డీఎల్డీవో కెసిహెచ్ అప్పారావు, డీఎం హెచ్వో డి.మహేశ్వరరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ స్పందనలో 10 ఫిర్యాదులు
భీమవరం క్రైం, డిసెంబరు 12 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చేసే ప్రకటనల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తతతో ఉండాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ అన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మొత్తం 10 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎక్కువగా అత్తింటి వేధింపులు, సరిహద్దు విషయంలో గొడవలు, సివిల్ తగాదాలపై ఫిర్యాదులు అందినట్టు తెలిపారు.