వరద భయం..
ABN , First Publish Date - 2022-08-13T05:41:24+05:30 IST
వశిష్ఠ గోదావరి క్రమే ణ ఉగ్రరూపం దాల్చుతోంది.
ఉగ్రరూపం దాల్చుతున్న వశిష్ఠ ..
వరద నీటిలో నవరసపురం ఎస్టీ కాలనీ
మాచేనమ్మ ఆలయం చుట్టూ చేరిన వరదనీరు
ముంపులో కనకాయలంక, పెదలంక గ్రామాలు
నరసాపురం రూరల్ /ఆచంట/ యలమంచిలి, ఆగస్టు 12: వశిష్ఠ గోదావరి క్రమే ణ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వరద నీరు విడిచిపెట్టడంతో నరసాపురం వద్ద నీటిమట్టం పెరిగి రేవులు నీట మునిగాయి. రెండోవ రోజూ ఉభయ గోదావరి జిల్లాల మధ్య పంటు రాకపోకలు నిలిచిపోయాయి. పొన్నపల్లి, నందమూరి కాలనీ లోకి వరద నీరు చేరడంతో మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నారు. మాధ వాయిపాలెం స్లూయిజ్ లీకేజీ నీరు నక్కల డ్రెయిన్ మీదుగా పోటెత్తడంతో చిన మామిడిపల్లి, సరిపల్లి ప్రాంతాల్లోని వందలాది ఎకరాలు నీట మునిగాయి. కొత్త నవ రసపురంలోని ఎస్టీ కాలనీలోకి వరద నీరు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగితే ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఆచంట మండలంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పెదమల్లం మాచేనమ్మ ఆలయం చుట్టు వరద నీరు చేరింది. మండలంలోని అన్ని పుష్కరఘాట్లు నీట మునిగాయి. మాచేనమ్మ ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న పలు భవనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. కోడేరు వద్ద తహసీల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఫ యలమంచిలి మండలంలోని పెదలంక, కనకాయలంక గ్రామాలు వరద నీటి బారిన పడ్డాయి. ఈ గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లాలంటే పడవల్లో ప్రయాణిస్తున్నారు. మరో లంకగ్రామమైన బాడవలో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. దొడ్డిపట్ల పల్లిపాలెం, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, లక్ష్మీ పాలెం, యలమంచిలి లంక, చించినాడ, ఏనుగువానిలంక గ్రామాల లంక భూముల్లోకి వరదనీరు చేరుతోంది.