వరద ముప్పు
ABN , First Publish Date - 2022-08-12T05:40:51+05:30 IST
వశిష్ఠ గోదావరికి వరద మరింత పెరిగింది.
ఉధృతంగా వశిష్ఠ.. పంటు రాకపోకలు నిలిపివేత
కాల్వ గండి నుంచి ప్రధాన కాల్వలోకి వరద నీరు
క్రాస్ బండ్ వేసేందుకు అధికారుల యత్నాలు
ఆచంట మండలంలో నీట మునిగిన పుష్కర ఘాట్లు
మాచేనమ్మ ఆలయానికి చేరువలో వరద గోదావరి
వరద ముంపులో కనకాయలంక
లంక భూముల్లోకి చేరిన వరద నీరు
నరసాపురం/ఆచంట/యలమంచిలి, ఆగస్టు 11: వశిష్ఠ గోదావరికి వరద మరింత పెరిగింది. ఎగువ నుంచి గురువారం సుమారు నాలుగు లక్షల క్యూసె క్కుల వరద నీరు పోటెత్తడంతో నరసాపురం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఉభయ గోదావరి జిల్లాల మధ్య పంటు, పడవల రాకపోకల్ని నిలిపివేశారు. రాను న్న రెండు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరగవచ్చన్న హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. పొన్నపల్లిలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడుతున్నారు. పరివాహాక ప్రాంతంలోకి అవుట్ ఫాల్ స్లూయిజ్ తలుపులను మూసి వేసినా లీకేజీల ద్వారా నీరు బయటకు వచ్చేస్తుడంతో చినమామిడిపల్లి, సరపల్లి ప్రాంతాలోకి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇసుక ర్యాంపు పూర్తిగా నీటి మునిగింది. పట్టణంలోని అమరేశ్వర, కొండాలమ్మ, వలంధర్ రేవులనీన నీట మునిగాయి. పిండాల రేవులో స్నానాలు, పిండ ప్రదానాలు నిలిపి వేశారు. గత నెలలో వరద ఉధృతికి కోతకు గురైన పొన్న పల్లి ప్రాంతం వద్ద ఇసుక బస్తాలు వేసి గట్టును పటిష్ట పరుస్తున్నారు. ఆ మార్గం లో రాకపోకల్ని పూర్తిగా నిలిపి వేశారు. గతంలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద గండి పడిన చోట యుద్ధ ప్రాతిపదికన క్రాస్బండ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నా నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో అడ్టుకట్ట నిలవడం లేదు. దీంతో గోదావరి నుంచి కాల్వ గుండా వస్తున్న వరద నీరు నిడదవోలు పంట కాల్వలోకి పోటెత్తుతోంది.
జూ ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురంలోని పుష్కరఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. పెదమల్లం మాచేనమ్మ ఆలయ చేరువలో వరదనీరు చేరింది. గోదావరి ఉదృతి కారణంగా గోదావరిలో పడవలు నామ మాత్రంగా తిరుగుతున్నాయి.
యలమంచిలి మండలంలో కనకాయలంక గ్రామం ముంపు బారిన పడింది. దీంతో గ్రామస్థులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. బాడవ, పెదలంక గ్రామంలో దళితపేట, దొడ్డిపట్లలో పల్లిపాలెం, లక్ష్మీపాలెంలో పల్లిపాలెం, గంగడపాలెం ఏటిగట్టు లోపల ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ వరదనీరు చేరుతోంది. యలమంచిలి, కంచు స్తంభంపాలెం, అబ్బిరాజుపాలెం, యలమంచిలిలంక, చించినాడ, గ్రామాల లంక భూముల్లోకి వరదనీరు చేరింది. లంక భూముల్లోని పశువులను, పంట ఉత్పత్తులను రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.