బకాయి జీతాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-01-28T05:15:55+05:30 IST
కరోనా ఉధృతిలో ఆస్పత్రుల్లో పనిచేసిన నాలుగు నెలల కాలానికి బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొవిడ్ కాంట్రాక్టు సిబ్బంది గురువారం డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
డీఎంహెచ్వో కార్యాలయం వద్ద కొవిడ్ కాంట్రాక్టు సిబ్బంది ధర్నా
ఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 27: కరోనా ఉధృతిలో ఆస్పత్రుల్లో పనిచేసిన నాలుగు నెలల కాలానికి బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొవిడ్ కాంట్రాక్టు సిబ్బంది గురువారం డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ గతే డాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సీఆర్ఆర్ పాలిటెక్నిక్, సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాలలో నిర్వహించిన కొవిడ్ కేర్ సెంటర్లలో 96 మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తించారన్నారు. వీరికి రావాల్సిన రూ.36 లక్షలు బకాయి జీతాలు పది నెలలు గడిచినా ఇంత వరకు చెల్లించలేదన్నారు. బకాయిలను చెల్లించని పక్షంలో శుక్రవారం నుంచి నిరవధిక దీక్ష చేపడతామని డీఎంహెచ్వో డాక్టర్ బి.రవిని కలిసి స్పష్టం చేశారు. తక్షణమే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని జోక్యం చేసుకుని బకాయి జీతాలు చెల్లించాలని కోరారు. ధర్నాలో కాంట్రాక్టు సిబ్బంది గోవిందరావు, దుర్గాప్రసాద్, వెంకటేష్, మహాలక్ష్మి, కుమారి పాల్గొన్నారు.