పంచారామ క్షేత్రంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-03T17:33:20+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు ప్రారంభమయ్యాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ఈ వేడుకలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ... భారతదేశంలో తెలుగు భాషకు అపారమైన ఆదరణ ఉందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు మాట్లాడే వారుంటారని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా మూలాలను మరిచిపోవద్దని... భాష పట్ల వాత్సల్యం చూపాలని సూచించారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష ఒక్కటే అన్నారు. భీమవరం ప్రాంతం యాసకు, భాషకు, సాహిత్యానికి, ఆతిథ్యానికి ప్రాధాన్యమిస్తుందని స్మాత్మానందేంద్ర స్వామి పేర్కొన్నారు.