శ్మశాన స్థలమే దిక్కు..
ABN , First Publish Date - 2022-05-18T06:25:04+05:30 IST
పండించిన పంటల ఆరబోతకు రైతులకు శ్మశాన స్థలమే దిక్కయింది.
కల్లాలు లేక మొక్కజొన్న పంట ఆరబోత
చాట్రాయిలో రైతుల వెతలు
15 ఏళ్ల క్రితం గోదాముకు స్థలం కేటాయింపు
నిధులు రాక ఆగిన నిర్మాణం
గోదాము, ప్లాట్ఫాంల కోసం అన్నదాత వేడుకోలు
చాట్రాయి, మే 17: పండించిన పంటల ఆరబోతకు రైతులకు శ్మశాన స్థలమే దిక్కయింది. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో రైతులు తాము పండించిన పంటలు ఆరబెట్టుకోటానికి కల్లాలు లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 15 ఏళ్ళ క్రితం తిరువూరు ఏఎంసీ చైర్మన్గా దేశిరెడ్డి రాఘవరెడ్డి హయాంలో మార్కెటింగ్ గోదాము నిర్మాణానికి భూమి కేటాయించారు. అయితే నిధులు మంజూరు కాక కార్యరూపం దాల్చలేదు. దీంతో మొక్కజొన్న, ధాన్యం ఆరబెట్టేందుకు స్థలాలు కరవయ్యాయి. చెరువులు, బంజరు భూములు, పాఠశాలల స్థలాలు కూడా సరిపోకపోవటంతో గత్యంతరం లేక శ్మశాన స్థలాల్లో కూడా పంటలు ఆరబోసి రాత్రి, పగలు రైతులు కాపలా కాస్తున్నారు. వర్షాలు పడితే పంటలు తడిచి రైతులు నష్టపోతున్నారు. కల్లాలు లేక తాము పడుతున్న ఇబ్బందుల ప్రభుత్వం గమనించి చాట్రాయిలో మార్కెటింగ్ గోదాములు, పంటలు ఆరబెట్టుకోటానికి ప్లాట్ఫాంలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.